'Thalliki Vandanam' ఆధార్ అనుసంధానమైతేనే తల్లికి వందనం
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:39 PM
'Thalliki Vandanam' Only with Aadhaar Linkage పిల్లల చదువుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం పొందాలంటే తల్లుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి. ఇది లేకుంటే అర్హత ఉన్నా పథకం పొందలేం. తల్లలు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవ్వదు. అన్ని వివరాలు పక్కాగా ఉండడం అత్యంత కీలకం.
యుద్ధప్రాతిపదికన ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు
కసరత్తు చేస్తున్న అధికారులు
పార్వతీపురం, జూలై12(ఆంధ్రజ్యోతి): పిల్లల చదువుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం పొందాలంటే తల్లుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి. ఇది లేకుంటే అర్హత ఉన్నా పథకం పొందలేం. తల్లలు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవ్వదు. అన్ని వివరాలు పక్కాగా ఉండడం అత్యంత కీలకం. కాగా జిల్లాలో 1541 మంది విద్యార్థులతో పాటు వారి తల్లులకు సంబంధించి ఆధార్ అనుసంధానం కాలేదు. ఇప్పటివరకు 149 మంది విద్యార్థుల ఆధార్ అనుసంధానం పూర్తయింది. మరో 1392 మంది వివరాలు ఆధార్కు అనుసంధానం చేయాల్సి ఉంది. ఈ నెలలోనే తల్లికి వందనం కింద నగదు జమ కానునుండడంతో అధికారులు ఆధార్ అనుసంధానం చేసే పనిలో పడ్డారు. కాగా మండలాలవారీగా చూసుకుంటే గరుగుబిల్లిలో 34 మంది, గుమ్మలక్ష్మీపురంలో 102 , బలిజిపేట 15, సాలూరు 224, కొమరాడ 104 , మక్కువ 73 , వీరఘట్టం 25, సీతంపేట 125 , కురుపాం 107 , పార్వతీపురం 255 మంది, భామినిలో 118 మంది, పాలకొండ 81 , సీతానగరం 14 , పాచిపెంట 229 , జియ్యమ్మవలస 35 మంది ఆధార్ అనుసంధానానికి దూరంగా ఉన్నారు.
గతేడాది 1.22 లక్షల మంది లబ్ధి పొందగా.. పలు సాంకేతిక కారణాలతో సుమారు 8 వేల మంది ఈ పథకానికి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో అందరికీ యుద్ధ ప్రాతిపదికన ఆధార్ అనుసంధానం చేసి పథకం వర్తింపజేయాలని జిల్లా విద్యాశాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పడంతో హెచ్ఎంలు ఆ పనిలో పడ్డారు. దీనిపై డీఈవో బ్రహ్మాజీరావును వివరణ కోరగా.. విద్యార్థులు, వారి తల్లుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేపట్టే ప్రక్రియను పూర్తి చేస్తున్నామన్నారు.