Suvarnamukhi drinking water scheme will be completed in two years సువర్ణముఖి తాగునీటి పథకం రెండేళ్లలో పూర్తి చేస్తాం
ABN , Publish Date - Apr 06 , 2026 | 12:24 AM
Suvarnamukhi drinking water scheme will be completed in two years సువర్ణముఖి నది నుంచి తాగునీరు సరఫరా చేసే పథకం వైసీపీ చేతగానితనంతో నిలిచిపోయిందని, రూ.123 కోట్లతో టెండర్లు పిలిచామని, త్వరలో పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేస్తామని మున్సిపల్ శాఖమంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు.
సువర్ణముఖి తాగునీటి పథకం
రెండేళ్లలో పూర్తి చేస్తాం
బొబ్బిలిలో బజారు రహదారులను విస్తరిస్తాం
గొల్లపల్లి బైపాస్ నుంచి రోడ్డు నిర్మిస్తాం
మున్సిపల్ శాఖమంత్రి నారాయణ
బొబ్బిలి, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి):
సువర్ణముఖి నది నుంచి తాగునీరు సరఫరా చేసే పథకం వైసీపీ చేతగానితనంతో నిలిచిపోయిందని, రూ.123 కోట్లతో టెండర్లు పిలిచామని, త్వరలో పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేస్తామని మున్సిపల్ శాఖమంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం రాత్రి అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బొబ్బిలికి వరాలు ప్రకటించారు. మురుగుకాలువల వ్యవస్థను గాడిలో పెట్టి ఆధునికీకరించేందుకు రూ.14 కోట్లతో ప్రతిపాదన ఉందన్నారు. బజారు రోడ్ల విస్తరణకు స్థానికులతో మాట్లాడి టీడీఆర్ బాండ్ల పంపిణీ ద్వారా పనుల మంజూరుకు కృషి చేస్తామన్నారు. రాణిమల్లమ్మదేవి పార్కులో హంగులు కల్పించేందుకు రూ. 3.50 లక్షలు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. గొల్లపల్లి బైపాస్ జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు రోడ్డు, ఇతర పనుల కోసం రూ.2 కోట్లను సత్వరం మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఫ టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా, వారి డిపాజిట్లు వాపసు చేయకుండా ఇబ్బంది పెట్టారని, ఆ చెల్లింపుల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రూ.175 కోట్లు విడుదల చేశారని గుర్తుచేశారు. గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో ప్రపంచంలోనే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి టిడ్కో ఇళ్ల సముదాయాల నిర్మాణానికి చంద్రబాబు శ్రీకారం చుడితే జగన్ సర్వనాశనం చేసేశాడని విమర్శించారు. మంచి రంగులు వేస్తే వాటిని కాదని వైసీపీ రంగులు వేశారని, పరిపాలనా అనుమతి లేకుండానే కాంట్రాక్టర్లను బెదిరించి టిడ్కో ఇళ్లకు రంగులు మార్చారని చెప్పారు. టిడ్కో సముదాయాల్లో అత్యుత్తమ టెక్నాలజీతో లిఫ్ట్లు, భూగర్భ డ్రైనేజీ, కిటికీలు, ఫ్లోరింగ్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించామని, ఇటీవల 7 లక్షల ఇళ్లు అప్పగించామని చెప్పారు. జూలై, ఆగస్టు నాటికి నూరుశాతం ఇళ్లను అప్పగిస్తామన్నారు. ఇంటింటికీ తాగునీటి సరఫరా పథకాల కోసం కేంద్రం నుంచి పథకాలను మంజూరు చేయిస్తే వాటికి మ్యాచింగ్ గ్రాంట్ మంజూరుకాక రద్దయ్యాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటన్నింటినీ పునరుద్ధరిస్తున్నామన్నారు. 153 లక్షల టన్నుల చెత్త భూమి లోపల పేరుకుపోయిందని, దీనివల్లభూగర్భజలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, లేటెస్ట్ టెక్నాలజీతో ఈ చెత్త సమస్యను పరిష్కరించేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు, జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, ప్రత్యేకాధికారి జేవీఎస్ఎస్ రామ్మోహనరావు, కమిషనర్ లాలం రామలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాంబార్కి శరత్బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.