గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Jun 02 , 2026 | 12:13 AM
మండలంలోని గర్భాం పంచాయతీ పరిధిలో గల గొల్లవాని మామిడితోటలో సోమవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది.
మెరకముడిదాం, జూన్ 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని గర్భాం పంచాయతీ పరిధిలో గల గొల్లవాని మామిడితోటలో సోమవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే.. తోటలో జీడి పిక్కలు ఏరేందుకు వచ్చిన మహిళ లు మృతదేహాన్ని గుర్తించి.. నరసయ్యపేట మాజీ సర్పంచ్ అప్పలనారాయణకు సమాచారం అందించారు. ఆయన గర్భాం వీఆర్వో సందీప్, తలయారీ అసిరయ్య కు సమాచారం ఇవ్వగా.. వీరు ఘటనా స్థలానికి వెళ్లి, పరిశీలించారు. సుమారు 20 రోజుల ముందు ఈ ఘటన జరిగి ఉంటుందని ఊహించారు. మృతదేహం పూర్తిగా గుర్తించలేని విధంగా కుళ్లిపోయి ఉండడంతో వీఆర్వో సందీప్ బుదరాయ వలస పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకు ని, మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహానికి అక్కడే చీపురుపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యాధికారిణి ఝాన్సీ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్చార్జి ఎస్ఐ నారాయణరావు తెలిపారు. ఈ పరిశీల నలో ఏఎస్ఐ ఆరి, రైటర్ వెంకటేశ్వరరావు, వీఆర్వో సందీప్ ఉన్నారు.