నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:23 PM
పాఠశాలలకు ప్రభుత్వం శుక్రవారం నుంచి వేసవి సెలవులను ప్రకటించింది.
- జూన్ 12న పునఃప్రారంభం
- స్నేహితులకు వీడ్కోలు పలికిన విద్యార్థులు
విజయనగరం కలెక్టరేట్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలకు ప్రభుత్వం శుక్రవారం నుంచి వేసవి సెలవులను ప్రకటించింది. 45 రోజులు ఆనంతరం తిరిగి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. చివరి రోజున విద్యార్థులు పాఠశాలల నుంచి బయటకు వస్తూ ఒకరికొకరు టాటా టాటా.. బాయ్ బాయ్ అని చెప్పుకుంటా ఇళ్లకు వెళ్లారు. వసతి గృహాల్లో చదివే విద్యార్థులు కూడా ఇంటి బాటపట్టారు. తమ బట్టలు, పుస్తకాలు, లగేజీ బ్యాగులు పట్టుకుని ఇంటికి పయనమయ్యారు. కొందరు తల్లిదండ్రులు వచ్చి వారి పిల్లలను తీసుకెళ్లారు. దీంతో బసుస్టేషన్లు కిటకిటలాడాయి.
విద్యార్థులు భద్రం
వేసవి సెలవుల్లో విద్యార్థుల భద్రతకు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వేసవిలో ఎక్కువ వేడి ఉంటుంది. అత్యవసరమైతే తప్ప పిల్లలను బయటకు పంపించవద్దు. ఈత కోసం వారు కాలువలు, చెరువులు, నదులు, వాగులు వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు చూసుకోవాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ బయిటకు తిరగరాదు. ఎక్కువగా నీరు తాగాలి. తేలికపాటి దుస్తులు ధరించాలి. ప్రమాదకర ఆటలు ఆడకూడదు.