student suicide తలబాధను భరించలేక ఆత్మహత్య
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:08 AM
student suicide తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు తీర్చాలని కలలు కన్నాడు. మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యం పెట్టుకున్నాడు. ఎన్నో ఆశలతో డిఫెన్స్ అకాడమీలో చేరాడు. పాపం ఆ విద్యార్థి ఆశలు, ఆశయాలను తలనొప్పి కబళించింది. తలబాధను భరించలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్తవలస డిఫెన్స్ అకాడమీలో గురువారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.
తలబాధను భరించలేక ఆత్మహత్య
డిఫెన్స్ అకాడమీలో విద్యార్థి బలవన్మరణం
హాస్టల్ రూమ్లో ఫ్యానుకు ఉరి వేసుకుని..
కొత్తవలస, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు తీర్చాలని కలలు కన్నాడు. మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యం పెట్టుకున్నాడు. ఎన్నో ఆశలతో డిఫెన్స్ అకాడమీలో చేరాడు. పాపం ఆ విద్యార్థి ఆశలు, ఆశయాలను తలనొప్పి కబళించింది. తలబాధను భరించలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్తవలస డిఫెన్స్ అకాడమీలో గురువారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.
కాకినాడ జిల్లా యానాం సమీపంలో కాజూలూరు మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన ఉదికి సుబ్రహ్మణ్యం, స్వర్ణలత దంపతుల ఏకైక కుమారుడు వికాష్(16) కొత్తవలసలోని ఓ ప్రైవేటు డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులిద్దరూ సొంతూరుకు దగ్గరలో ఉన్న జీడిపిక్కల కంపెనీలో రోజువారీగా కూలీలుగా పని చేస్తున్నారు. కుమారుడు డిఫెన్స్లో చేరాలనుకుంటున్నానని చెప్పడంతో కొత్తవలసలో ఉన్న అకాడమీలో జాయిన్ చేశారు. వికాష్ కూడా ఇంటర్ ముగిసిన వెంటనే డిఫెన్స్ ఉద్యోగిగా చేరాలనుకున్నాడు. తద్వారా తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలనుకున్నాడు. ఇక్కడ చేరిన తరువాత కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. గత మూడు రోజులుగా విపరీతమైన తలనొప్పి వస్తుండడంతో కళాశాల యాజమాన్యం స్థానికంగా ఉన్నఆసుపత్రిలో చూపించారు. బుధవారం సాయంత్రం తనకు తల నొప్పి ఎక్కువుగా వస్తోందని, సెలవు ఇచ్చినట్టయితే తల్లిదండ్రుల వద్దకు వెళతానని చెప్పడంతో యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడించారు. ఫోన్ చేసే సమయానికే సాయంత్రం కావడంతో అప్పుడు బయలుదేరితే రాత్రి అయిపోతుందని, గురువారం ఉదయం పంపించాలని తల్లిదండ్రులే యాజమాన్యానికి సూచించారు. దీంతో తలనొప్పితో బాధపడుతున్న వికాష్ను హాస్టల్ రూంలోనే విశారంతి తీసుకోవాలని చెప్పారు. గురువారం రోజులాగే వికాష్తో పాటు అదే గదిలో ఉంటున్న తోటి విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. హాస్టల్ రూంలోనే ఉండిపోయిన వికాస్ అంతలోనే ఏమైందో ఏమోగాని ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. తరగతులు పూర్తయ్యాక మధ్యాహ్నం గదికి వచ్చిన విద్యార్థులు ఉరేసుకున్న విద్యార్థి వికాష్ను చూసి భయపడ్డారు. విషయం యాజమాన్యానికి తెలియజేయడంతో వారు వెంటనే విషయాన్ని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. గురువారం కళాశాలకు వచ్చిన తల్లిదండ్రులు మొదట యాజమాన్యంపై అనుమానం వ్యక్తం చేసినప్పటికీ చివరకు తాము పడుతున్న కష్టాలు చూసి ఒక పక్క, విపరీతమైన తలనొప్పి కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని తెలిపారు. తండ్రి ఉదిత సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ షణ్ముఖరావు కేసు నమోదు చేసి ఎస్ఐ ప్రసాదరావుకు దర్యాప్తు నిమిత్తం అప్పగించారు. కళాశాల యాజమాన్యం ఏమైనా వేధింపులకు గురిచేసిందా? అనే విషయాన్ని పరిశీలించినట్లు సీఐ తెలిపారు. తనకు శిక్షణ ఇస్తున్న ఉపాధ్యాయుడు తన పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించే వారని, తాను చనిపోవడానికి విపరీతమైన తలనొప్పితో పాటు తల్లిదండ్రుల కష్టాలను తీర్చలేకపోతున్నానన్న బాధే కారణమని తెలియ చేస్తూ లేఖ కూడా రాసినట్టు సీఐ తెలిపారు. విద్యార్థి శరీరంపై ఎటువంటి గాయాలు లేవన్నారు. తల్లిదండ్రుల సమక్షంలోనే విద్యార్థి మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం శృంగవరపుకోట తరలించి అనంతరం తల్లిదండ్రులకు అప్పగించినట్టు సీఐ షణ్ముఖరావు తెలిపారు.