strugle for caste validation కుల ధ్రువీకరణకు ఎన్నో పాట్లు
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:57 PM
strugle for caste validation జిల్లాలో కులధ్రువీకరణ పత్రం కోసం వందలాది మంది ఇబ్బందులు పడుతున్నారు ప్రతి గ్రామంలోనూ 30 నుంచి 40 మంది బాధితులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత వైసీపీ హయాంలో 2023 జూన్ 23 నుంచి అదే ఏడాది జూలై 31 వరకూ జగనన్న సురక్ష పేరిట 11 రకాలు సేవలు ఉచితంగా అందజేశారు.
కుల ధ్రువీకరణకు ఎన్నో పాట్లు
రీ-ఇస్యూయన్స్ సర్టిఫికెట్ల కోసం పడిగాపులు
అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
విజయనగరం కలెక్టరేట్, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి):
- గంట్యాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ పింఛను కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో ముందుగా కులధ్రువ పత్రం పొందాల్సి వచ్చింది. సచివాలయంలో కులధ్రువపత్రం కోసం ఆధార్ నెంబరు నమోదు చేశాక అప్పటికే ఆ మహిళ పేరున రీ-ఇస్యూయన్స్ కుల ధ్రువపత్రం ఉన్నట్లు ఆన్లైన్లో చూపించింది. డౌన్లోడ్ చేసి చూస్తే ఆమె ఓసీగా చూపించింది. వాస్తవానికి ఆమె బీసీ మహిళ. మార్చుకునేందుకు అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తోంది. చివరికి తహసీల్దార్ ద్వారా జేసీ లాగిన్కు రీవర్క్ చేయడానికి పంపిస్తున్నట్లు అధికారులు చెప్పారని ఆ మహిళ వెల్లడించారు. అయినా కొన్నాళ్లుగా ఈ సమస్య పరిష్కారం కాలేదు.
- బొబ్బిలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తన పిల్లల ఉన్నత చదువు కోసం దరఖాస్తు చేసుకోవడానికి కుల ధ్రువ పత్రం అవసరం పడింది. స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేశారు. పిల్లల ఆధార్ నెంబర్లు నమోదు చేశాక రీ-ఇస్యూయన్స్ కేస్ట్ ఆన్లైన్లో ఉన్నట్లు చూపించింది. ఇక వెంటనే కుల ధ్రువ పత్రం మంజూరు అవుతుందని తండ్రి సంబరపడ్డాడు. డౌన్లోడ్ చేసి చూస్తే ఎస్సీ కులానికి చెందినట్లు చూపించింది. వాస్తవారికి వీరు బీసీ కులస్థులు. దీనిని రద్దు చేసి కొత్త కులధ్రువ పత్రం కోసం దరఖాస్తు చేసుకుందామని సచివాలయంలో అడిగితే అలా రాదని, జేసీ లాగిన్లో రీవర్క్ చేసిన తరువాత మంజూరవుతుం దని చెప్పారు.
జిల్లాలో కులధ్రువీకరణ పత్రం కోసం వందలాది మంది ఇబ్బందులు పడుతున్నారు ప్రతి గ్రామంలోనూ 30 నుంచి 40 మంది బాధితులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గత వైసీపీ హయాంలో 2023 జూన్ 23 నుంచి అదే ఏడాది జూలై 31 వరకూ జగనన్న సురక్ష పేరిట 11 రకాలు సేవలు ఉచితంగా అందజేశారు. అప్పట్లో లక్ష్యాల కోసం అవసరం లేకపోయినా వలంటీర్లు ఇంటింటా తిరిగి కుల, ఆదాయ, నివాసం వంటి ధ్రువ పత్రాలకు ఆన్లైన్ చేశారు. ఆధార్ ద్వారా కుల ధ్రువ పత్రాలు మంజూరు చేశారు. అయితే ఆధార్లో పేర్లు తప్పులు, చిరునామా, పుట్టిన తేదీల్లో తప్పులు ఉన్నా అలాగే కులధ్రువ పత్రాలు మంజూరు చేశారు. వీటిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసి పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కులం తప్పుగా ఉన్నా? పేరు తప్పులు ఉన్నా? ధ్రువ పత్రంలో తండ్రి పేరు లేకపోయినా జారీ చేసేశారు.
2024లో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక కొత్తగా కులధ్రువ పత్రాలు పంపిణీ చేయడం కోసం ఆన్లైన్ ప్రక్రియ చేపట్టారు. 2024 నవంబరు నుంచి ఇప్పటి వరకూ 3,93,494 సుమోటో కులధ్రువ పత్రాలను ఆన్లైన్ చేశారు. అయితే రీ-ఇస్యూయన్స్ సర్టిఫికెట్లలో పొరపాట్లు ఉన్న వాటిని సరిచేసుకోవడం పెద్ద సమస్య మారింది. ఎవరిదైనా ధ్రువ పత్రం రీ-ఇస్యూయన్స్కు వస్తే వాటిని సరి చేసుకోవాలంటే ముందుగా తహసీల్దార్కు సమస్యను చెప్పుకోవాలి. అక్కడ నుంచి తహసీల్దార్ మొయిల్ ద్వారా జేసీ లాగిన్ పంపించాలి. జేసీ డిజిటల్ సిగ్నేచర్ ద్వారా రీవర్క్ చేస్తే తిరిగి అటువంటి వారంతా కొత్తగా ధ్రువ పత్రం కోసం ఆన్లైన్ చేసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా వేలాది ధ్రువ పత్రాలను జేసీ తన లాగిన్లో రీవర్క్ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రధానంగా విద్యార్థులు కుల ధ్రువ పత్రాల్లో ఏమైనా సమస్యలు ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.