అధిక ధరకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:18 AM
జిల్లా లో ఎమ్మార్పీకి మించి యూరియా విక్రయించినా, ట్యాగింగ్ కు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ సేతు మాధవన్ హెచ్చరించారు.
జేసీ సేతు మాధవన్
విజయనగరం, కలెక్టరేట్, జూలై 10(ఆంధ్రజ్యోతి): జిల్లా లో ఎమ్మార్పీకి మించి యూరియా విక్రయించినా, ట్యాగింగ్ కు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ సేతు మాధవన్ హెచ్చరించారు. శుక్రవారం విజయనగరంలోని తన చాంబర్లో ఎరువుల డీలర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీ కంటే అధిక ధరకు యూరియాను విక్రయించ డం, యూరియాతో పాటు ఇతర ఎరువులు సూక్ష్మపోషకా లు, పురుగు మందులు, ఇతర ఉత్పత్తులను తప్పనిసరిగా కొనుగోలు చేయాలని రైతులపై ఒత్తిడి చేయడం వంటి చర్యలకు పాల్పడడం ఫెర్టిలైజరు కంట్రోల్ ఆర్డర్ 1985 నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని చెప్పారు. రైతుల నుంచి ఫిర్యాదులు పునరావృతం కాకుండా ప్రతి డీలరు బాధ్యతాయుతం గా వ్యవహరించాలన్నారు. వ్యవసాయ అధికారులు జిల్లాలోని అన్ని ఎరువుల షాపులకు తనిఖీ చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల షాపు యజమానికి షోకాజ్ నోటీసు
సంతకవిటి, జూలై 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో యూరియాను అధిక ధరలకు విక్రయించడం, లింక్ సేల్స్కు పాల్పడ డంపై అధికారులు స్పందించి గత నెల 30న మండలంలోని పలు ఎరువుల దుకాణాల యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయినా కొన్ని దుకాణాల్లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు కొనసాగుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో జిల్లా వ్యవసాయ శాఖాధికారి రామారావు ఆదేశాలతో మండల వ్యవసాయ అధికారి సీబీ యశ్వంత్రావు శుక్రవారం మిర్తివలసలోని మణికంఠ ఎంటర్ప్రైజెస్ ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించారు. దీంతో ఆ దుకాణం ఎరువుల విక్రయ లైసెన్స్ను ఐదు రోజుల పాటు సస్పెండ్ చేస్తూ, షోకాజ్ నోటీసులు జారీ చేశారు.