Banned Cotton Seeds నిషేధిత పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Apr 29 , 2026 | 11:54 PM
Strict Action Against Sale of Banned Cotton Seeds ప్రభుత్వం నిషేధించిన హెర్బిసైడ్ టాలెంట్ (హెచ్టీ) పత్తి విత్తనాలను ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర బృంద సభ్యులు, వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయ ఏడీఏఆర్ శశిధర్రెడ్డి, ఏవో కె.ఆంజనేయకుమార్ తెలిపారు. బుధవారం భామిని, వీరఘట్టం మండలాల్లోని పలు ఎరువుల దుకాణాలను పరిశీలించారు.
వీరఘట్టం/భామిని /కురుపాం,ఏప్రిల్29(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నిషేధించిన హెర్బిసైడ్ టాలెంట్ (హెచ్టీ) పత్తి విత్తనాలను ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర బృంద సభ్యులు, వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయ ఏడీఏఆర్ శశిధర్రెడ్డి, ఏవో కె.ఆంజనేయకుమార్ తెలిపారు. బుధవారం భామిని, వీరఘట్టం, కురుపాం మండలాల్లోని పలు ఎరువుల దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్టాక్, సేల్స్ రిజిస్టర్లతో పాటు నిల్వలను తనిఖీ చేశారు. హెచ్టీ విత్తనాలతో రైతులు పండిస్తే పంట నష్టం ఇన్సూరెన్స్కు అనర్హులవుతారని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీటీ పత్తికి మాత్రమే అనుమతి ఉందన్నారు. హెచ్టీ పత్తి వల్ల కలుపు మొక్కలు ఏర్పడతాయని, ఇతర పంటలు, జీవన వైవిధ్యంపై వాటి ప్రభావం పడుతుందని తెలిపారు. జిల్లాలో కొన్ని చోట్ల హెచ్టీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నట్లు తెలిసిందని, ఈ నేపథ్యంలో షాపులపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నామని వారు వెల్లడించారు. నిషేధిత పత్తి విత్తనాలతో పట్టుబడితే ఐదేళ్ల జైలు, రూ.లక్షకు పైగా జరిమానా విధించే అవకాశం ఉందన్నారు.