అరకు పార్లమెంట్ పరిధిలో టీడీపీని మరింత బలోపేతం చేయాలి: లోకేశ్
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:41 PM
అరకు పార్లమెంట్ పరిధిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సూచించారు. శుక్రవారం విజయ వాడలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తదితరులతో ఆయన సమీక్షించారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు.
పార్వతీపురం, జూలై 3(ఆంధ్రజ్యోతి): అరకు పార్లమెంట్ పరిధిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సూచించారు. శుక్రవారం విజయ వాడలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తదితరులతో ఆయన సమీక్షించారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏడు నియోజకవర్గాల పరిధిలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై లోకేశ్ తమకు దిశానిర్దేశం చేసినట్లు మంత్రి సంధ్యారాణి ఫోన్లో ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని , అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని లోకేశ్ సూచించారని చెప్పారు. ఇదే సమయంలో ఐటీడీఏల పరిస్థితి, గిరిజన ప్రాంతాల అభివృద్ధిని ఆయన దృష్టికి తెచ్చామన్నారు. వారం రోజుల్లో అరకు పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు ఇన్చార్జిలతో పాటు నాయకులు, కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణ ప్రత్యేకంగా చేపడతామని తెలిపారు.