Tribal ఆదివాసీల ఆర్థికాభివృద్ధికి అడుగులు
ABN , Publish Date - Aug 09 , 2026 | 11:47 PM
Steps Toward Tribal Economic Development మన్యంలో ఆదివాసీల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. జిల్లాలో అమృత రకం పైనాపిల్ సాగు, సవర్ ఆర్ట్స్, ఇతర పంటల అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలో ఆయన మాట్లాడారు.
మన్యంలో అమృత రకం పైనాపిల్ సాగుకు ప్రోత్సాహం
సవర ఆర్ట్స్, ఇతర పంటల అభివృద్ధికి చర్యలు
ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీతో కుదిరిన ఒప్పంద పత్రాల అందజేత
పార్వతీపురం/టౌన్, ఆగస్టు9(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఆదివాసీల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. జిల్లాలో అమృత రకం పైనాపిల్ సాగు, సవర్ ఆర్ట్స్, ఇతర పంటల అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ముందుగా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో పైనాపిల్ సాగుకు గాను ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ, కురుపాం కేవీకే శాస్త్రవేత్తలతో కుదిరిన ఒప్పంద పత్రాన్ని పీవో వైశాలికి అందించారు. మన్యంలో జీడి పంట వేసి 25 ఏళ్లు పూర్తవగా.. ఆదాయం తగ్గే పరిస్థితి ఉండడంతో ప్రత్యామ్నాయంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా సీతంపేటలో సవర ఆర్ట్స్, ఇతర పంటల అభివృద్ధికి కుదిరిన ఒప్పంద పత్రాన్ని కూడా ఐటీడీఏ ఇన్చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్కు అందించారు. ఆదివాసీలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, జీవో నెంబరు 3కు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని, అందరికీ ఆమోదయోగ్యమైన విధానం తీసుకొస్తామని వెల్లడించారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా వేలాది మంది గిరిజన విద్యార్థినులతో థింసా నృత్యం చేయించి.. గిన్నిస్బుక్ రికార్డు సొంతం చేసుకున్న నేపథ్యంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఐటీడీఏ పీవోలు వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్కు సీఎం అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతి, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ దన్ను దొర, అరకు, పాలకొండ నియోజకవర్గాల ఇన్చార్జిలు భూదేవి, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.