స్వీయ గణన ప్రారంభం
ABN , Publish Date - Apr 16 , 2026 | 11:15 PM
జిల్లాలో స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) ప్రారంభమైంది. జనగణన-2027 ప్రక్రియలో భాగంగా కలెక్టర్ ఎన్.ప్రభాకర్రెడ్డి గురువారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
- సెల్ఫ్ ఎన్యుమరేషన్ పూర్తి చేసిన కలెక్టర్
పార్వతీపురం, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) ప్రారంభమైంది. జనగణన-2027 ప్రక్రియలో భాగంగా కలెక్టర్ ఎన్.ప్రభాకర్రెడ్డి గురువారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన గృహ సమాచారాన్ని స్వయంగా ఫోన్లో నమోదు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. జిల్లా ప్రథమ పౌరుడిగా కలెక్టర్ స్వయంగా వివరాలు నమోదు చేయడం ద్వారా డిజిటల్ గణన ప్రాధాన్యతను చాటిచెప్పారు. అధికారులు, ప్రజలకు ఈ ప్ర క్రియపై అవగాహన కల్పించడంతో పాటు అందరిలో స్ఫూర్తినింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ గణన ప్రక్రియలో భాగంగా ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకొనే సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానం గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రజలు తమ సొంత మొబైల్ ఫోన్ల ద్వారా తమ కుటుంబ వివరాలను ఖచ్చితత్వంతో నమోదు చేసుకోవచ్చునన్నారు. జిల్లా వ్యాప్తంగా సెల్ఫ్ ఇన్యుమరేషన్పై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ నెల 30 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఎక్కడా సాంకేతిక ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ ఽఅధికారి కె.హేమలత, గణాంకశాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.