Mangalsutra! ఆరుబయట పడుకుంటే.. పుస్తెలతాడు లాక్కెళ్లాడు!
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:21 PM
Sleeping Outdoors.. Thief Snatches Mangalsutra! వేసవి నేపథ్యంలో రాత్రి వేళ ఇంటి బయట నిద్రిస్తున్న మహిళ మెడలో పుస్తెలతాడు లాక్కోని ఓ దుండగుడు పరారీ అయ్యాడు. వేకువ జామున జరిగినఈ ఘటనతో గుమ్మలక్ష్మీపురం వాసులు ఉలిక్కిపడ్డారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు..
గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): వేసవి నేపథ్యంలో రాత్రి వేళ ఇంటి బయట నిద్రిస్తున్న మహిళ మెడలో పుస్తెలతాడు లాక్కోని ఓ దుండగుడు పరారీ అయ్యాడు. వేకువ జామున జరిగినఈ ఘటనతో గుమ్మలక్ష్మీపురం వాసులు ఉలిక్కిపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మలక్ష్మీపురం శివారులో సుజాత అనే మహిళ కొడుకు, భర్తతో కలిసి నివసిస్తుంది. కురగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. శుక్రవారం తన భర్త పనిమీద వేరే ఊరికి వెళ్లిపోవడంతో.. ఆ రోజు రాత్రి కొడుకుతో కలిసి ఇంటి వరండాలో పడుకుంది. అయితే శనివారం వేకువజామున నాలుగు గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి.. ఆమె మెడలో మూడు తులాలు పుస్తెలతాడు లాక్కోని.. అక్కడి నుంచి ఉడాయించాడు. నిద్ర మత్తు నుంచి సుజాత తేరుకునే లోపు ఆ దుండగుడు .. తోటల మీదుగా పారిపోయాడు. వెంటనే ఆమె స్థానికుల సాయంతో ఎల్విన్పేట పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేసింది. సీఐ బి.హరి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి బాధితురాలు సుజాతను పరామర్శించి.. చోరీ ఘటనపై ఆరా తీశారు. మండల కేంద్రంలో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని, దర్యాప్తు వేగవంతం చేసి.. నిందితుడిని త్వరగా పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు.