Economic Development జిల్లా ఆర్థికాభివృద్ధికి తొడ్పడాలి
ABN , Publish Date - Feb 06 , 2026 | 11:47 PM
Should Contribute to District Economic Development జిల్లా ఆర్థికాభివృద్ధికి బ్యాంకర్లు తోడ్పడాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రుణాల మంజూరు ప్రక్రియలో బ్యాంకర్లు మరింత ఉత్సాహంగా పాల్గొని పిలుపునిచ్చారు.
పార్వతీపురం, ఫిబ్రవరి6(ఆంధ్రజ్యోతి): జిల్లా ఆర్థికాభివృద్ధికి బ్యాంకర్లు తోడ్పడాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రుణాల మంజూరు ప్రక్రియలో బ్యాంకర్లు మరింత ఉత్సాహంగా పాల్గొని పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లో పలు బ్యాం కర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగంతో బ్యాంకర్లు సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. లబ్ధిదారులను గుర్తించి సకాలంలో రుణాలు అందజేయాలని, వారిలో వినూత్న ఆలోచనలను ప్రోత్సహించాలని సూచించారు. దీనివల్ల జిల్లా ఆర్థికంగా బలోపేతమవుతుందన్నారు. ప్రజలకు ఆర్థిక క్రమశిక్షణ, అక్షరాస్యతపై బ్యాంకర్లు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని.. ప్రజలందరికీ బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ చేయాలని కోరారు. గ్రామీణుల అవసరాలను గుర్తించి వారికి ఆర్థిక తోడ్పాటు అందించాలన్నారు. ఖాతాదా రులకు ఆర్థిక లావాదేవీలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని మేనేజర్లను ఆదేశించారు. గ్రామాల్లో ‘ముచ్చట్లు’ కార్యక్రమం జరగనుందని, దీనిని బ్యాంకర్లు వినియోగించుకోవాలని సూచిం చారు. గత పదేళ్లలో మంజూరు చేసిన రుణాలు, యూనిట్లపై సమీక్షించాలన్నారు. రుణాలతో యూనిట్లు స్థాపించి ఆర్థికంగా ఎదిగిన లబ్ధిదారుల విజయగాఽథలను అందరికీ తెలియజేయా లన్నారు. మొండి బాకీల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. రానున్న రెండు వారాల్లో భారీ స్థాయిలో రుణమేళాలు నిర్వహించాలన్నారు. మంగళ, బుధ, గురువారాల్లో ఏపీజీబీ, ఇతర బ్యాంకు బ్రాంచ్ల వారీగా ఈ మేళాలు జరగాలని ఆదేశించారు. వాటి పూర్తి వివరాలను డీఆర్డీఏ వాట్సాప్ గ్రూప్ల ద్వారా క్షే త్రస్థాయికి చేరవేయాలని సూచించారు. జిల్లా అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులను రాబట్టేలా బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎస్.సోమశేఖర్, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, జిల్లా ఖజానా అధికారి బి.ప్రసాదరావు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.