28న గొర్రెల పెంపకందారుల
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:26 PM
జిల్లా గొర్రెల పెంపకందారుల కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు, డైరక్టర్ల ఎన్నిక ఈ నెల 28న విజయనగరంలోని గురజాడ రోడ్డులో ఉన్న పశు సంవర్థకశాఖ కార్యాలయంలో జరగనుంది.
కో-ఆపరేటివ్ డైరక్టర్ల ఎన్నిక?
- చేతులెత్తే పద్ధతిలోనే..
- ఏర్పాట్లు చేస్తున్న పశు సంవర్థకశాఖ అధికారులు
విజయనగరం రూరల్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా గొర్రెల పెంపకందారుల కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు, డైరక్టర్ల ఎన్నిక ఈ నెల 28న విజయనగరంలోని గురజాడ రోడ్డులో ఉన్న పశు సంవర్థకశాఖ కార్యాలయంలో జరగనుంది. ఈ మేరకు జిల్లా పశు సంవర్థక శాఖాధికారులకు సమాచారం అందింది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘ ఎన్నికలు జూలైలో పూర్తయ్యాయి. రెండు జిల్లాల పరిధిలో యాక్టివ్లో ఉన్న 105 సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ప్రక్రియ పూర్తవ్వడంతో జిల్లా స్థాయిలో అధ్యక్షులు, డైరక్టర్ల ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఈ ఎన్నికను చేతులెత్తే పద్ధతిలో నిర్వహించనున్నారు. 105 సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు అంతా డైరక్టర్లను ఎన్నుకుంటారు. ఈ 12 మంది డైరక్టర్లలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 28న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకూ డైరకర్ల పదవుల కోసం నామినేషన్ల స్వీకరణ, 12 గంటల నుంచి 12.30 వరకూ నామినేషన్ల పరిశీలన, 12.45కు బరిలో ఉన్న డైరక్టర్ల జాబితా అధికారిక ప్రకటన, మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 వరకూ నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకూ ఎన్నిక, అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు. నామినేషన్ ఫీజుకి సంబంధించి బీసీలు రూ.800, ఎస్సీ, ఎస్టీలు రూ.400, ఇతరులు రూ.2వేలు చెల్లించాల్సి ఉంటుంది. 12 మంది డైరక్టర్లలో ఒకటి ఎస్సీ లేదా ఎస్టీలకు, మరొకటి బీసీలకు, మిగతావి ఇతరులకు కేటాయించనున్నారు.