'SAR' ‘సర్’ ప్రక్రియ వేగవంతం
ABN , Publish Date - Jun 27 , 2026 | 11:50 PM
'SAR' Process Accelerated జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితాల సవరణ (సర్) ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆదేశించారు. నిబంధనల ప్రకారం ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేయాలని బీఎల్వోలకు సూచించారు.
బీఎల్వోలకు కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆదేశం
పార్వతీపురం రూరల్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితాల సవరణ (సర్) ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆదేశించారు. నిబంధనల ప్రకారం ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేయాలని బీఎల్వోలకు సూచించారు. శనివారం వెంకంపేటలోని బూత్ నెంబర్ 61లో చేపడుతున్న సర్ ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బీఎల్వోలతో మాట్లాడి వివరాల నమోదులో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సర్పై పూర్తి సమాచారాన్ని ఓటర్లకు తెలియజేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో పార్వతీపురం ఆర్డీవో మాధురి, తహసీల్దార్ సీహెచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ఇలా..
జిల్లాలో ఇప్పటివరకు 90.96 శాతం మేర ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ పూర్త యిందని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా కురుపాం నియోజ కవర్గంలో 98.44 శాతం మేర ఫారాల పంపిణీ పూర్తయిందన్నారు. ఇక్కడ మొత్తం 1,95,943 మంది ఓటర్లు ఉండగా, 1,78,218 ఎన్యుమరేషన్ ఫారాలు అందించినట్లు పేర్కొన్నారు. పాలకొండలో 196943 మంది ఓటర్లు ఉండగా.. 178218 మందికి(90.49) ఫారాలు ఇచ్చారన్నారు. సాలూరులో 2,05,985 మంది ఓటర్లుగాను 1,81,833 మందికి ఫారాలు ( 88.28 శాతం) అందిం చినట్లు వెల్లడించారు. పార్వతీపురంలో 1,91,718 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటివరకు 1,66,204 మందికి ఫారాలు( 86.69 శాతం) అందజేశామన్నారు.