Malaria మలేరియా నియంత్రణకు పటిష్ఠ ప్రణాళిక
ABN , Publish Date - Jul 31 , 2026 | 11:52 PM
Robust Plan to Control Malaria జిల్లాలో మలేరియా జ్వరాల నియంత్రణకు పటిష్ఠ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖాధికారులతో సమీక్షించారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి జ్వరపీడితులకు స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
పార్వతీపురం, జూలై31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మలేరియా జ్వరాల నియంత్రణకు పటిష్ఠ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖాధికారులతో సమీక్షించారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి జ్వరపీడితులకు స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. జూలై నెలాఖరు వరకు జిల్లాలో 47,324 రాపిడ్ డయాగ్నోస్టిక్ పరీక్షలు చేపట్టినట్లు డీఎంహెచ్వో విజయలక్ష్మి తెలిపారు. కాగా ప్రతి పీహెచ్సీ, సీహెచ్సీలో అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని, మలేరియా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవసరమైన కిట్లును ముందుగానే సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు.
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి శనివారం ప్రధాని నరేంద్రమోదీ రానున్న నేపథ్యంలో కలెక్టర్ సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలను సభకు తరలించే బస్సులు సమయానికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. బస్సుల పర్యవేక్షణకు ప్రత్యేక యాప్, మండల స్థాయిలో కమాండ్ కం ట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రయాణికులకు ఆహారం, నీరు అందించాలని ఆదేశించారు. ప్రతి బస్సులో పది మంది బఫర్గా ఉండాలన్నారు. బస్సు నెంబర్లు, ప్రయాణికుల వివరాలు జిల్లా గ్రూప్ల్లో వెంటనే పోస్టు చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు.