Road పంట పొలాలకు అనుసంధానంగా రహదారులు
ABN , Publish Date - Jul 27 , 2026 | 12:54 AM
Road Connectivity to Farmlands జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో పంట పొలాలకు అనుసంధానంగా గ్రావెల్ రహదారుల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సర్వే చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేయడంతో సచివాలయాల పరిధిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఆ పనిలో నిమగ్నమయ్యారు.
వీబీజీ రామ్జీ పథకంలో నిధుల కేటాయింపు
గరుగుబిల్లి, జూలై26(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో పంట పొలాలకు అనుసంధానంగా గ్రావెల్ రహదారుల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సర్వే చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేయడంతో సచివాలయాల పరిధిలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఆ పనిలో నిమగ్నమయ్యారు. కాగా ఈ గ్రావెల్ రోడ్ల నిర్మాణాలకు వీబీజీ రామ్జీ పథకంలో నిధులు కేటాయించనున్నారు. పనుల నిర్వహణ, పర్యవేక్షణ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి అప్పగించనున్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 451 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే ఆయాచోట్ల పంట పొలాలకు అనుసంధానంగా రహదారుల నిర్మాణానికి ముందస్తుగా జియోట్యాగింగ్ చేయాల్సి ఉంది. ఈఎంఎంఎస్ యాప్లో వివరాలను పూర్తిస్థాయిలో పొందుపర్చాలి. ఈ ప్రత్యేక యాప్లో రహదారి పేరు, సర్వే నంబరు, ప్రాంతం, రహదారి రకం , పొడవు, నేల రకం, ప్రస్తుతం రోడ్డు పరిస్థితి తదితర వివరాలను అప్లోడ్ చేయాలి. రహదారి మెరుగుతో లబ్ధి పొందే రైతుల భూమి వివరాలను కూడా పొందుపర్చాలి. ఈ నెల 30లోగా సర్వే పూర్తిచేసి సమాచారాన్ని డేటాలో అప్లోడ్ చేయాల్సి ఉంది. పొలాలకు వెళ్లే మార్గంలో శ్మశాన వాటికలు ఉంటే ప్రత్యేకంగా రహదారి ప్రతిపాదన చేయాలి. ప్రధానంగా రైతలకు చెందిన సర్వే నెంబర్లను పొందుపర్చాల్సి ఉంది. భూవివాదాలు రాకుండా ముందస్తుగా రైతుల అభిప్రా యాలను తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో గ్రావెల్ రహదారులు ఎంతమేర అనుకూలంగా ఉన్నాయన్న వివరాలను ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గ్రామాల్లో తిరిగి యాప్లో పొందుపర్చాల్సి ఉంది.
సర్వేకు ఆదేశాలు
జిల్లాలో గ్రావెల్ రహదారులకు సంబంధించి సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వీబీ జీ రామ్జీ పథకం మెటీరియల్ నిధులతో ఈ రహదారుల నిర్మాణాలు చేపడతాం. ఈ నెల 30లోగా సర్వే వివరాలను ఇంజనీరింగ్ సిబ్బంది యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. ఆ ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
- కె.రామచంద్రరావు, పీడీ, డ్వామా, పార్వతీపురం మన్యం