Republic Day గణతంత్ర వేడుకలకు సిద్ధం
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:31 AM
Ready for Republic Day Celebrations గణతంత్ర వేడుకలకు జిల్లాకేంద్రం ముస్తాబైంది. దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
బెలగాం, జనవరి25(ఆంధ్రజ్యోతి): గణతంత్ర వేడుకలకు జిల్లాకేంద్రం ముస్తాబైంది. దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేదికతో పాటు ఆ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పోలీస్ పరేడ్ నిర్వహణకు అవసరమైన మార్కింగ్ పనులు పూర్తి చేశారు. ప్రత్యేక వేదికతో పాటు అతిథుల కోసం గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఐటీడీఏ, డీఆర్డీఏ, మెప్మా, సెర్ప్ తదితర శాఖల స్టాల్స్, శాఖల వారీగా అభివృద్ధిని తెలియజేసేలా శకటాలను సిద్ధం చేశారు. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను ఆదివారం జాయింట్ కలెక్టర్ యశ్వంత్కుమార్ రెడ్డి పర్యవేక్షించారు. కాగా సోమవారం కలెక్టర్ ప్రభాకర్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. పోలీస్ దళాల వందనాన్ని స్వీకరిస్తారు. అనంతరం జిల్లా ప్రగతిని వివరించనున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందించనున్నారు. మరోవైపు కలెక్టర్ కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు.