Rabid Dog పిచ్చి కుక్క స్వైర విహారం
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:37 AM
Rabid Dog on the Rampage నాగూరు గ్రామంలో శుక్రవారం ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ముగ్గురిని గాయపరిచి.. దూడలపైనా దాడి చేసింది. దీంతో ఆ గ్రామస్థులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
దూడలపైనా దాడి
గరుగుబిల్లి, ఏప్రిల్3(ఆంధ్రజ్యోతి): నాగూరు గ్రామంలో శుక్రవారం ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ముగ్గురిని గాయపరిచి.. దూడలపైనా దాడి చేసింది. దీంతో ఆ గ్రామస్థులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుడ్ఫ్రైడే ప్రార్థనల నేపథ్యంలో గ్రామానికి చెందిన మండంగి గణేష్, ధనలక్ష్మి దంపతులు తమ రెండేళ్ల చిన్నారి లిఖితతో కలిసి స్థానిక చర్చికి వచ్చారు. కొద్దిసేపటి తర్వాత లిఖిత ఆరుబయటకు వచ్చి అడుకుంటుండగా కుక్క ఒక్కసారిగా ఆ చిన్నారిపై విరుచుకుపడి తీవ్రంగా గాయపరిచింది. లిఖితను కాపాడేందుకు ప్రయత్నించిన స్థానికులు చింతల అప్పలనాయుడు, అక్కేన చంద్రశేఖరనాయుడులపై కూడా కుక్క దాడి చేసి గాయపరిచింది. అనంతరం వీధుల్లోకి పరుగులు తీసిన శునకం అక్కేన సింహాచలం సహా మరొకరికి చెందిన గేదె దూడలపై దాడి చేసింది. కాగా క్షతగాత్రులను పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆ ప్రాంతాసులు కోరుతున్నారు.