Ration రేషన్ కష్టాలకు చెక్
ABN , Publish Date - Feb 02 , 2026 | 12:01 AM
Putting an End to Ration Woes గిరిశిఖర గ్రామాల్లో ప్రజల రేషన్ కష్టాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ మేరకు సబ్డిపోల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది.
గిరిశిఖర గ్రామాల గిరిజనులకు లబ్ధి
సీతంపేట రూరల్, ఫిబ్రవరి1(ఆంధ్రజ్యోతి): గిరిశిఖర గ్రామాల్లో ప్రజల రేషన్ కష్టాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ మేరకు సబ్డిపోల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. సాలూరు మండలంలో 4, గుమ్మలక్ష్మీపురం 26, పాచిపెంట 17, సీతంపేట 25, మక్కువ 7, కొమరాడ 7, కురుపాం మండలంలో 11వరకు జీసీసీ సబ్ డిపోలు ఏర్పాటు చేయనున్నారు. వాటిని ఈ నెలలోనే ప్రారంభించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సబ్డిపోలు ప్రారంభమైతే గిరిజనులకు రేషన్ కష్టాలు తీరునున్నాయి. కిలోమీటర్ల దూరం నడిచి కొండ దిగి ఎక్కాల్సిన అవసరం ఉండదు. నూతనంగా ప్రారంభించనున్న ఈ సబ్డిపోలు జీసీసీ డీఆర్డిపోలకు అనుసంధానంగా నిర్వహించనున్నారు. డీఆర్ డిపోలకు ఎప్పుడు రేషన్ సరుకుల స్టాక్ వేస్తారో అప్పుడే సబ్డిపోలకు కూడ సరఫరా చేస్తారు. ప్రతీ నెలలో రెండు రోజులు ఈ సబ్డిపోలను ఆయా జీసీసీ డీఆర్ డిపోల సేల్స్మెన్, డీలర్లు తెరచి పరిసర గ్రామాల లబ్ధిదారులకు రేషన్ సరుకులను పంపిణీ చేయాల్సి ఉంటుంది. దీనిపై జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి అశోక్ను వివరణ కోరగా.. ‘ గిరి శిఖర గ్రామాల్లో ఉన్న గిరిజనుల కోసం సబ్డిపోల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. అయితే వాటి ప్రారంభానికి సంబంధించి ఇంకా తేదీలు ఖరారు కాలేదు.’ అని తెలిపారు.