Public Welfare Is the Goal ప్రజా సంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:10 AM
Public Welfare Is the Goal ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం సాలూరు పట్టణంలోని 8,9,10 వార్డుల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు.
సాలూరు, జనవరి31(ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం సాలూరు పట్టణంలోని 8,9,10 వార్డుల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు నెలవారీగా ప్రభుత్వం పింఛన్ అందిస్తూ.. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తోందన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను అందిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిరుపతిరావు, కౌన్సిలర్లు వైదేహి, చంద్ర, శ్రీను, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు 90 శాతం పంపిణీ
గరుగుబిల్లి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 312 సచివాలయాల పరిధిలో తొలిరోజు 90 శాతం మేర పింఛన్ల పంపిణీ జరిగింది. ఫిబ్రవరి-1 ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకరోజు ముందే పింఛన్దారులకు పింఛన్ సొమ్ము అందించారు. మొత్తంగా 1,38,831 మంది పింఛన్దారులకు గాను రూ. 59.29 కోట్లు విడుదల చేశారు.
అంబటి వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం
సాలూరు, జనవరి31(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాలూరులో ఆమె విలేఖర్లతో మాట్లాడారు. ‘అంబటీ నువ్వు మనిషివా..? జంతువువా..? రాక్షసుడివా..? 151 సీట్లు నుంచి 11 సీట్లకు పడిపోయినా.. ఇంకా సిగ్గు లేదా? సీఎం పదవిలో ఉన్న వ్యక్తిని అలా దూషించొచ్చా! ముఖ్యమంత్రి హోదాను అవమానించేలా మాట్లాడడం ప్రజాస్వామ్యానికే అవమానం. రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలు అసహ్యకరం. రాజకీయ లాభాల కోసం హద్దులు దాటి మాట్లాడితే సహించేదిలేదు. తక్షణమే అంబటి సీఎం చంద్రబాబునాయుడుకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ’ అని మంత్రి అన్నారు. ఆమె వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.