Tenant Farmers కౌలు రైతులకు సకాలంలో రుణాలు అందించండి
ABN , Publish Date - May 16 , 2026 | 11:51 PM
Provide Timely Loans to Tenant Farmers జిల్లాలో అర్హులైన కౌలు రైతులందరికీ సకాలంలో బ్యాంకు రుణాలు అందించాలని జాయింట్ కలెక్టర్ యశ్వంత్కుమారెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో బ్యాంకర్లు, పలు శాఖల అధికారులతో సమీక్షించారు.
పార్వతీపురం, మే 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అర్హులైన కౌలు రైతులందరికీ సకాలంలో బ్యాంకు రుణాలు అందించాలని జాయింట్ కలెక్టర్ యశ్వంత్కుమారెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో బ్యాంకర్లు, పలు శాఖల అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు కౌలు రైతులకు ఆశించిన స్థాయిలో రుణాలు అందించకపోవడంపై జేసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో దర ఖాస్తులు లేదా కార్డులు ఉన్నప్పటికీ కేవలం కొద్ది మందికి మాత్రమే రుణాలు అందించడం ఏమిటని ప్రశ్నించారు. సీసీఆర్ కార్డుల నిర్వహణ, పునర్ధురణ ప్రక్రియలో ఉన్న సాంకేతిక ఇబ్బందులను వెంటనే అధిగమించాలని స్పష్టం చేశారు. బ్యాంకర్లు, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి కౌలు రైతులకు మేలు జరిగేలా చూడాలన్నారు. 2025-26లో 134 శాతం వార్షిక క్రెడిట్ ప్లాన్ సాధించినట్లు వెల్లడించారు. భూ యజమానులు గతంలో తీసుకున్న రుణాల లీన్ మార్కులను పరిశీలించాలన్నారు. ప్రస్తుత కౌలుదారులు సీసీఆర్ కార్డుల ఆధారంగా ఏ సర్వే నెంబర్లలో సాగు చేస్తున్నారో చూసుకుని తక్కువ వడ్డీ రేటుకు రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. సకాలంలో రుణాలు చెల్లించి రిబేట్ పొందేందుకు కౌలురైతులు ఆసక్తి చూపిస్తు న్నారని తెలిపారు. కేవం రిస్క్ ఎక్కువగా ఉంటుందనే నెపంతో రుణాల తిరస్కరణ సరికాదన్నారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ సోమశేఖర్, ఆర్బీఐ అధికారులు, పలు బ్యాంకుల ప్రతినిధులు, నాబార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు.