Summative-2 Examinations సమ్మెటివ్-2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Mar 02 , 2026 | 12:30 AM
Preparations Completed for Summative-2 Examinations జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు వార్షిక ( సమ్మెటివ్ 2 ) తుది పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రోజూ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
ఆ తర్వాత వారికి టెన్త్ సిలబస్ బోధన
సాలూరు రూరల్,మార్చి 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు వార్షిక ( సమ్మెటివ్ 2 ) తుది పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రోజూ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వాస్తవంగా ఏటా టెన్త్ పరీక్షల అనంతరం ఏప్రిల్లో ఆరు నుంచి తొమ్మిది తరగతుల వారికి తుది పరీక్షలు జరిగేవి. అయితే ఈ ఏడాది ఆరు నుంచి 8 తరగతుల వారికి ఏప్రిల్ ఆరు నుంచి తుది పరీక్షలు నిర్వహించనున్నారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రం ముందుగానే నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత వారికి పదో తరగతి సిలబస్ను బోధించునున్నారు. ఈ మేరకు ఈ నెల 2 నుంచి 12 వరకు తొమ్మిది విద్యార్థులకు తుది పరీక్షలను నిర్వహిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ,ప్రైవేట్ యాజమాన్యాల్లో 236 ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాల్లో ఉన్న తొమ్మిది తరగతి విద్యార్థులు నేటి నుంచి ఎస్ఏ- 2 పరీక్షలను రాయనున్నారు.
పదో తరగతికి గ్రాండ్ టెస్ట్
వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 2 నుంచి 12 వరకు గ్రాండ్ టెస్ట్లను నిర్వహించనున్నారు. ఇటీవలే వారికి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 16 నుంచి ఆరంభమయ్యే పబ్లిక్ పరీక్షల ముందు వారిలో ఆత్మస్థైర్యం పెంపొందిం చడానికి ఈ టెస్ట్ ఎంతగానో దోహపడుతుందని అధికారులు తెలిపారు. జిల్లాలో 15 మండలాల్లో ఉన్న 183 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో రోజూ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఈ గ్రాండ్ టెస్ట్లను నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణకు గంట ముందుగా ఎంఈవో కార్యాలయాల నుంచి ప్రశ్నపత్రాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఆయా ఎంఈవోలు ఏర్పాట్లు చేశారు.