Palm Oil పామాయిల్ సాగు ఆశాజనకం
ABN , Publish Date - Mar 03 , 2026 | 11:47 PM
Palm Oil Cultivation Shows Promise జిల్లా రైతులకు పామాయిల్ సాగు ఆశాజనకంగా మారింది. ప్రభుత్వ రాయితీ, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తుండడంతో ఏటా సాగు విస్తీర్ణం పెంచుతున్నారు. పంట వేసిన వెంటనే ఆదాయం రాకపోయినప్పటికీ నాలుగేళ్ల తర్వాత ఆశించిన స్థాయిలోనే లాభాలు వస్తుండడంతో జిల్లావాసులు ఈ సాగుపై దృష్టి సారిస్తున్నారు.
బోర్లు ఏర్పాటు చేస్తే మరింత ప్రయోజనం
పార్వతీపురం, మార్చి3(ఆంధ్రజ్యోతి): జిల్లా రైతులకు పామాయిల్ సాగు ఆశాజనకంగా మారింది. ప్రభుత్వ రాయితీ, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తుండడంతో ఏటా సాగు విస్తీర్ణం పెంచుతున్నారు. పంట వేసిన వెంటనే ఆదాయం రాకపోయినప్పటికీ నాలుగేళ్ల తర్వాత ఆశించిన స్థాయిలోనే లాభాలు వస్తుండడంతో జిల్లావాసులు ఈ సాగుపై దృష్టి సారిస్తున్నారు. మరికొందరు పామాయిల్ తోటల్లోనే అంతర పంటలు సాగు చేసుకుని ఎంతోకొంత ఆదాయం పొందు తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 20 వేల 680 హెక్టార్లలో పామాయిల్ సాగువుతుంది. గత ఏడాది నవంబరులో 19,598, డిసెంబరులో 19699 హెక్టార్లు వరకు సాగు విస్తీర్ణం ఉండేది. అంతర పంటలు వేసుకునే రైతులకు హెక్టార్కు రూ.5,250 వరకు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. అయితే బోరులు లేక కొతమంది రైతులు పామాయిల్ను సాగుకు దూర మవుతున్నారు. ఈ పంటపై అవగాహన లేక మరికొంతమంది సాగు చేపట్టలేకపోతున్నారు. కాగా గరుగుబిల్లి, బలిజిపేట, పార్వతీపురం, జియ్యమ్మవలస, కురుపాం, కొమరాడ, పాలకొండ, వీరఘట్టం, భామిని, గుమ్మలక్ష్మీపురం, సీతానగరం మండలాలకు చెందిన రైతులు తమ పంటను కురుపాం, విజయనగరం జిల్లా గరివిడిలో ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. సీతంపేట మండల రైతులు మాత్రం అనకాపల్లిలో కర్మాగారానికి పంటను తరలిస్తున్నారు. ‘జిల్లాలో పామాయిల్ సాగు ఆశాజనకంగా ఉంది. రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గతంలో ఐటీడీఏ ద్వారా బోర్లు మంజూరుకు ప్రతిపాదనలు పంపించాం. ’ అని జిల్లా హార్టికల్చర్ అధికారి క్రాంతి తెలిపారు.