Organ donation చనిపోతూ.. ఐదుగురు జీవితాల్లో వెలుగు
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:50 PM
Organ donation బొడ్డవర గ్రామానికి చెందిన మాసాడ కొండబాబు అలియాస్ భాను(33) తాను చనిపోతూ ఐదుగురు జీవితాల్లో వెలుగు నింపాడు.
చనిపోతూ.. ఐదుగురు జీవితాల్లో వెలుగు
కరెంటు స్తంభం నుంచి జారి పడి యువకుడి మృతి
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
ఎస్.కోటరూరల్, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): బొడ్డవర గ్రామానికి చెందిన మాసాడ కొండబాబు అలియాస్ భాను(33) తాను చనిపోతూ ఐదుగురు జీవితాల్లో వెలుగు నింపాడు. బ్రెయిన్డెడ్ కావడంతో వైద్యులు అవయవదానంపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. ప్రాణం దక్కకపోయినా ఐదుగురికి ప్రాణదాతగా ఉంటాడన్న ఉద్దేశంతో వారు అంగీకరించారు. ప్రైవేటు ఎలక్ట్రీషియన్గా ఉండే భాను ఎవరు ఏ పని చెప్పినా వెంటనే చేసేవాడని స్థానికులు చెబుతున్నారు. ఐదురోజుల కిందట కిల్తంపాలెం పంచాయతీ రాయివానిపాలెంలో కరెంటు స్తంభంపై పని చేస్తుండగా జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో ఉన్నాడు. విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం మృతిచెందాడు. తాను చనిపోతు ఐదుగురికి ప్రాణదాతగా మిగిలాడు. భానుకు కొద్దికాలం క్రితమే వివాహమైంది. తమ్ముడు మాసాడ గౌరీశంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. భాను కుటుంబాన్ని విద్యుత్ శాఖ సిబ్బంది ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.