Oh No… Elephants on the Move! బాబోయ్ ఏనుగులు
ABN , Publish Date - May 17 , 2026 | 11:46 PM
Oh No… Elephants on the Move! జియ్యమ్మవలస, భామిని మండలాల్లో గజరాజులు హల్చల్ చేస్తున్నాయి. పంటలు, వ్యవసాయ సామగ్రిని ధ్వంసం చేస్తూ ప్రజలను బెంబే లెత్తిస్తున్నాయి. ఆదివారం ఉదయం గజరాజులు జియ్యమ్మవలస మండలం చినబుడ్డిడి నుంచి పరజపాడు పొలిమేరకు చేరుకున్నాయి.
హడలిపోతున్న గ్రామస్థులు, రైతులు
జియ్యమ్మవలస/భామిని,మే17(ఆంధ్రజ్యోతి): జియ్యమ్మవలస, భామిని మండలాల్లో గజరాజులు హల్చల్ చేస్తున్నాయి. పంటలు, వ్యవసాయ సామగ్రిని ధ్వంసం చేస్తూ ప్రజలను బెంబే లెత్తిస్తున్నాయి. ఆదివారం ఉదయం గజరాజులు జియ్యమ్మవలస మండలం చినబుడ్డిడి నుంచి పరజపాడు పొలిమేరకు చేరుకున్నాయి. అక్కడ నుంచి కుందరతిరువాడకు వెళ్లి అరటి, చెరకు, వరి పంటలను నాశనం చేశాయి. ప్రస్తుతం అవి కుదమ, కేటీ వాడ గ్రామాల మధ్య అరటి తోటల్లో తిష్ఠ వేశాయి. దీంతో ఆ రెండు గ్రామాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంటలు పూర్తిగా నాశనం కాకముందే ఏనుగులను ఇక్కడి నుంచి తరలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక భామిని మండలం దిమ్మిడిజోల మామిడి తోటల్లో ఆదివారం నాలుగు ఏనుగులు సంచరించాయి. అక్కడున్న పాకతో పాటు నిల్వ ఉంచిన మామిడికాయలు, పళ్లు ధ్వంసం చేశాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. గత సోమవారం బాలేరులో సంచరించిన ఏనుగులు వంశధార నది అవతల గ్రామాలకు వెళ్లాయి. శనివారం రాత్రి తిరిగి దిమ్మిడిజోలకు చేరాయి. మొత్తంగా గజరాజులు ఏ రోజు ఏ ప్రాంతంలో ఉంటాయో తెలియక వంశధార నదీతీర ప్రాంత ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు ఫారెస్ట్ సిబ్బంది, బీట్ అధికారి కేశవ ఏనుగులు సంచరిస్తున్న ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.