Obstacles and Restrictions అడ్డంకులు.. ఆంక్షలు
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:25 PM
Obstacles and Restrictions పట్టణంలోని కొత్తపోలమ్మ గ్రామ దేవత ఘటాల ఊరేగింపు పోలీసుల భారీ బందోబస్తు మధ్య సాగింది. అయితే ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు.
స్థానికుల్లో తొలగని టెన్షన్
పార్వతీపురం/పార్వతీపురంటౌన్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని కొత్తపోలమ్మ గ్రామ దేవత ఘటాల ఊరేగింపు పోలీసుల భారీ బందోబస్తు మధ్య సాగింది. అయితే ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ఇదిలా ఉండగా బుధవారం అర్ధరాత్రి మాదిరిగానే గురువారం సాయంత్రం అమ్మవారి పాలజంగెడతో పాటు ఘటాల ఊరేగింపు సంబంధించి కొత్తవలస ప్రజల్లో టెన్షన్ నెలకొంది. ఘటాలను కనీసం వనంగుడి వరకైనా పోలీసులు వెళ్లనిస్తారా లేదా? అని ఆందోళన చెందారు. కాగా ఆలయం వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏఎస్పీ వెంకటేశ్వరరావుతో పాటు జిల్లాలో పలు స్టేషన్ల నుంచి సీఐలు, ఎస్ఐలతో పాటు పోలీసులు ఆలయం వద్దకు చేరుకున్నారు. కాగా సాయంత్రం 6 గంటల సమయంలో ఆలయంలోని పాలజంగిడితో పాటు ఘటాలను ఊరేగింపు చేసుకోవచ్చుని పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆలయం నుంచి 10 మీటర్ల దూరం వరకు ఘాటాలు వెళ్లగా.. అంతకన్నా ముందుకు వెళ్లకూడదని పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి నిలుపుదల చేశారు. దీంతో ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు గంటన్నర తరువాత కొత్తపోలమ్మ ఘటాలు పెద్దవీధి వైపు కదిలాయి. నాయుడువీధిలోని వనంగుడి వద్ద అమ్మవారికి భక్తులు మొక్కలు చెల్లించుకొని ఘాటాలు ముందుకు సాగాయి.
రోజుకో మలుపు
పార్వతీపురం పట్టణానికి చెందిన ఇప్పలపోలమ్మ, ఎర్రకంచమ్మ, బంగారమ్మల సోదరి కొత్తపోలమ్మ పండుగ నిర్వహణ రోజుకో మలుపు తిరుగుతుంది. ఏడేళ్ల తరువాత ఎంతో ప్రతి ష్ఠాత్మకంగా చేపడుతున్న కొత్తపోలమ్మ పండుగకు ఆది నుంచి ఆటంకాలు ఎదురవుతుండడంతో భక్తులు కలత చెందుతున్నారు. అమ్మవారి ఘటాలను తమ వీధిలో ఊరేగించాలని గత నాలుగురోజులుగా కొత్తవలస నందమూరి కాలనీలో ఉంటున్న నివాసితులు కలెక్టర్ ప్రభాకర్రెడ్డితో పాటు సబ్ కలెక్టర్ వైశాలికి వినతిపత్రాలు ఇచ్చారు. అదేవిధంగా కొత్తపోలమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వద్ద కూడా ఉత్సవ కమిటీ సభ్యులు, నందమూరి కాలనీవాసులు పంచాయితీ జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఉద్రిక్తతలను బట్టి చూస్తే అమ్మవారి పండుగ సజావుగా జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం కూడా సాయంత్రం 5 గంటలకు జరగాల్సి అమ్మవారి ఘటాల ఊరేగింపు రాత్రి 8 గంటల వరకు ఎన్నో అవరోధాలు, అడ్డంకుల మధ్య జరిగింది. ఇలాయితే పండుగను ఏలా నిర్వహిస్తామని, ఉత్సవ కమిటీ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు.