దస్తావేజు లేఖరుల ధర్నా
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:22 AM
రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ర్టేషన్ కార్యకలాపాలకు సంబంధించి పీపీపీ విధానం అమలు కోసం జీవో 396ని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం బొబ్బిలిలో దస్తావేజు లేఖరులు ధర్నా నిర్వహించారు.
బొబ్బిలి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ర్టేషన్ కార్యకలాపాలకు సంబంధించి పీపీపీ విధానం అమలు కోసం జీవో 396ని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం బొబ్బిలిలో దస్తావేజు లేఖరులు ధర్నా నిర్వహించారు. స్ధానిక సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి నినాదాలు చేశారు. ఈ నెల 20 నుంచి 31 వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా లేఖరుల సంఘం పెద్దలు సంకిలి రత్న సభాపతి, పక్కి పార్థసారధి, మడక అప్పారావు మాట్లాడుతూ పీపీపీ విధానంలో రిజిస్ర్టేషన్ సేవాకేంద్రాలు ఏర్పాటు చేయడం సబబుకాదన్నారు. ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి స్ధానికంగా గల దస్తావేజు లేఖరులపై ఎంతో నమ్మకం, విశ్వాసంతో లావాదేవీలు జరుపుకోవడం పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తోందన్నారు. దానికి పూర్తిగా చరమగీతం పాడుతూ పీపీపీ విధానం ద్వారా కార్యాలయాల లోపలే డాక్యుమెంట్లను తయారు చేయించుకునే పద్ధతిని అమలు చేస్తే వందలాది కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. కార్యక్రమంలో మడక అప్పారావు, రఘుకుమార్, రవికుమార్, త్రినాఽథ, పరవాడ సతీష్కుమార్, రామకృష్ణ, చీమల రాంబాబు, రాగాల అప్పారావు, డొంకాడ సంగమేశు తదితరులు పాల్గొన్నారు.