ITDA…! ఐటీడీఏకు రావట్లే..!
ABN , Publish Date - May 04 , 2026 | 10:56 PM
Not Turning Up to the ITDA…! సీతంపేట ఐటీడీఏలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు గడిచిన కొన్ని నెలలుగా వినతులు తగ్గుముఖం పడుతున్నాయి. వారంలో రెండు రోజులు పాటు నిర్వహించే పీజీఆర్ఎస్కు గిరిపుత్రులు ముఖం చాటేస్తుండడమే ఇందుకు కారణం.
సీతంపేట రూరల్, మే4(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు గడిచిన కొన్ని నెలలుగా వినతులు తగ్గుముఖం పడుతున్నాయి. వారంలో రెండు రోజులు పాటు నిర్వహించే పీజీఆర్ఎస్కు గిరిపుత్రులు ముఖం చాటేస్తుండడమే ఇందుకు కారణం. ఐటీడీఏకు కొన్నేళ్లుగా రెగ్యులర్ పీవో లేరు. ఇప్పుడున్న ఇన్చార్జి పీవో కూడా ఐటీడీఏ కార్యాలయంలో ఎప్పుడు ఉంటారో తెలియని పరిస్థితి. దీంతో గిరిపుత్రులు ఇటువైపు చూడడం లేదు. ఈ క్రమంలో ఐటీడీఏ కార్యాలయంలో సోమ, శుక్రవారాల్లో నిర్వహించే పీజీఆర్ ఎస్కు వచ్చే వినతులు కొన్ని నెలలుగా సింగిల్ డిజిట్కే పరిమితమవుతున్నాయి. ఆ రెండు రోజుల్లో ఏపీవో ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహిస్తుండగా.. ఇన్చార్జి పీవో అందుబాటులో లేకపోవడంతో గిరిజనులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఇకపోతే సోమవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు గిరిజనుల నుంచి ఏడు వినతులు వచ్చాయి. కోదులవీరఘట్టంలో వీధి కాలువల నిర్మాణం చేపట్టాలని , ఆయిల్ ఇంజన్, స్ర్పెయర్లు , రేషన్ కార్డులు ఇప్పించాలని పలువురు వినతిపత్రాలు ఇచ్చారు. దీనిపై ఏపీవో చిన్నబాబును వివరణ కోరగా..‘ ఐటీడీఏ ఇన్చార్జి పీవో పార్వతీపురంలో ప్రతి సోమవారం నిర్వహించే రెవెన్యూ క్లినిక్కు హాజరవుతున్నారు. సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో వారంలో రెండు రోజుల పాటు నిర్వహించే పీజీఆర్ఎస్కు నాతో పాటు అధికారులందరూ అందుబాటులో ఉంటున్నారు. గ్రీవెన్స్కు వచ్చే వినతుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం.’ అని తెలిపారు.