No matter what anyone says... ఎవరేమనుకున్నా..
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:20 AM
No matter what anyone says... నగరంలో అక్రమ కట్టడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఒకరిని చూసి మరొకరు పోటీపడి కట్టుకుంటూ వెళ్తున్నారు. ఈ విధంగా చేసుకుపోతే రానున్న కాలంలో విజయనగరం మరో బుడమేరు కానుందన్న ఆందోళన వ్యక్తమౌతున్నది. కనీసం ఫైర్ ఇంజన్ వెళ్లేందుకైనా.. చోటు లేకుండా నిర్మాణాలు చేపట్టటం దారుణమని సగటు నగర వాసులు వాపోతున్నారు.
ఎవరేమనుకున్నా..
నగరంలో వైసీపీ నాయకుల అక్రమ నిర్మాణాలు
అటువైపు చూడని కార్పొరేషన్ అధికారులు?
వెలుగుచూసిన వైసీపీ మాజీ కార్పోరేటర్ దందా!
ఏడాది నుంచి కొనసాగుతున్న నిర్మాణం
సమాచారం లేదంటున్న టౌన్ప్లానింగ్ అధికారులు
రోడ్డును ధ్వంసం చేసి డ్రైనేజీని నిర్మించిన వైనం
విజయనగరం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): నగరంలో అక్రమ కట్టడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఒకరిని చూసి మరొకరు పోటీపడి కట్టుకుంటూ వెళ్తున్నారు. ఈ విధంగా చేసుకుపోతే రానున్న కాలంలో విజయనగరం మరో బుడమేరు కానుందన్న ఆందోళన వ్యక్తమౌతున్నది. కనీసం ఫైర్ ఇంజన్ వెళ్లేందుకైనా.. చోటు లేకుండా నిర్మాణాలు చేపట్టటం దారుణమని సగటు నగర వాసులు వాపోతున్నారు.
వైసీపీకి చెందిన కొంతమంది తాజా మాజీ కార్పోరేటర్లు నగర పాలక సంస్థ కార్యాలయంలో ఉన్న పరిచయాలతో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఎవరి స్వార్థం కోసం వారు ఎంచక్కా నిబంధనలు అతిక్రమించి పోటాపోటీగా అక్రమ కట్టడాలకు దిగుతున్నారు. నగరపాలక సంస్థలో కీలక వ్యవహారాల నడిపేందుకు ప్రత్యేక గ్రూపు వుంది. చీమ చిటుక్కుమన్నా తాజా మాజీలకు ఇట్టే సమాచారం వెళ్తుంది. నగరపాలక సంస్థలో దాదాపు పది విభాగాలు ఉన్నాయి. వీటిలో అత్యంత కీలకమైనవి పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగు విభాగాలు. ఈ రెండింటిలో కొంతమంది తాజా మాజీ కార్పొరేటర్ల హవా ఇంకా కొసాగుతున్నది. తాజాగా 33వ డివిజన్ శ్రీనివాస కళాశాలకు వెళ్లే మార్గంలో ఓ మాజీ కార్పొరేటర్ 100 గజాల లోపు స్థలంలో కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. కనీస ప్రమాణాలు పాటించకుండా నిర్మాణం చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సెట్బ్యాక్ లేకుండా రోడ్డుకు ఆనుకుని కడుతున్నారు. అలాగే మురుగు నీరు, వ్యర్థాలు పోయేందుకు సీసీ రోడ్డును ధ్వంసం చేసి కాలువను తవ్వి నిర్మాణం చేపట్టారు. ఏదైనా ఆగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్ వెళ్లేందుకు కూడా దారి లేదు. అంతటితో ఆగకుండా నిబంధనలకు విరుద్ధంగా భవనంపై పెంట్ హౌస్ కూడా చేపట్టారు. ఏడాది నుంచి ఈ భవన నిర్మాణం కొనసాగుతోంది. పక్కనే వార్డు సచివాలయం ఉన్నా.. కనీసం స్పందించక పోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇదే విషయాన్ని నగరపాలక సంస్థ ప్రణాళిక అధికారి అప్పలరాజు వద్ద ప్రస్థావించగా.. ఇంతవరకు తమ దృష్టికి రాలేదని.. ఆక్రమ నిర్మాణమని పరిశీలనలో నిర్ధారణ అయితే.. శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.