New arrival for blockchain pilot project బ్లాక్చైన్ పైలట్ ప్రాజెక్టుకు కొత్తవలస
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:19 AM
New arrival for blockchain pilot project రెవెన్యూ, రిజిస్ర్టేషన్, సర్వే శాఖలను అనుసంధానం చేసే బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టుకు కొత్తవలస మండలాన్ని ఎంపిక చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం ఈ ప్రక్రియను అమరావతిలో ప్రారంభించారు.
బ్లాక్చైన్ పైలట్ ప్రాజెక్టుకు కొత్తవలస
తాజాగా ఎంపిక చేసిన ప్రభుత్వం
ఆవిష్కరణ ప్రక్రియను కొత్తవలస నుంచి తిలకించిన సిబ్బంది
కొత్తవలస, జూలై 23(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ, రిజిస్ర్టేషన్, సర్వే శాఖలను అనుసంధానం చేసే బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టుకు కొత్తవలస మండలాన్ని ఎంపిక చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం ఈ ప్రక్రియను అమరావతిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కొత్తవలస నుంచి వర్చువల్గా సిబ్బంది తిలకించారు. కొత్త ప్రాజెక్టులో భాగంగారెవెన్యూ రికార్డులకు భద్రత కల్పించడమే కాకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మూడు శాఖలు సమన్వయంతో పనిచేస్తాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీ వల్ల ప్రతి ఒక్కరి భూమికీ ఐడీ క్రియేట్ అవుతుంది. ఐడీలో భూమి హద్దులతోపాటు పట్టాదారు వివరాలు, విస్తీర్ణం నమోదవుతాయి. ఇకపై ఆ ఐడీలో చేసే ప్రతి మార్పులు, లావాదేవీలు కూడా నమోదు చేస్తారు. రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేయడం గాని, డబుల్ రిజిస్ర్టేషన్లు చేసే అవకాశం గాని ఉండదు. దీనవల్ల రిజిస్ర్టేషన్ వ్యవహారాలలో అక్రమాలు గాని, రెవెన్యూ రికార్డులలో మార్పులు, చేర్పులకు గాని అవకాశం ఉండదు. రెవెన్యూ, సర్వే, రిజిస్ర్టేషన్శాఖలతో అనుసంధానం కలిగిన అన్ని ప్రభుత్వ శాఖలకు రికార్డులను లైవ్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల రుణాలను తొందరగా పొందే వీలుంటుంది.
కొత్తవలస మండలాన్ని బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టు కోసం గుర్తించినట్లు తహసీల్దార్ రామ లక్ష్మి తెలిపారు. ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేస్తామన్నారు. రెవెన్యూ, సర్వే, రిజస్ర్టేషన్ శాఖల అనుసంధానం జరుగుతుందన్నారు.