Muhurtham on July 3rd? జూలై 3న ముహూర్తం?
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:03 AM
Muhurtham on July 3rd? జిందాల్ భూముల్లో ఇండస్ర్టీయల్ పార్కుల నిర్మాణానికి వచ్చే నెల 3న భూమి పూజ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారా? కడప నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా శ్రీకారం చుడతారా? అధికారికంగా ప్రకటన లేనప్పటికీ కూటమి నేతలు, స్థానిక రెవెన్యూ అధికారులు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు.
జూలై 3న ముహూర్తం?
జిందాల్ భూముల్లో ఇండిస్ట్రీయల్ పార్కుల నిర్మాణానికి భూమి పూజ
వర్చువల్గా సీఎం చంద్రబాబునాయుడు శ్రీకారం చుడతారని ప్రచారం
భూ సమస్యలపై సమాధానానికి రికార్డులను సిద్ధం చేసుకుంటున్న రెవెన్యూ
న్యాయం కోసం ఎదురుచూస్తున్న నిర్వాసిత రైతులు
జిందాల్ భూముల్లో ఇండస్ర్టీయల్ పార్కుల నిర్మాణానికి వచ్చే నెల 3న భూమి పూజ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారా? కడప నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా శ్రీకారం చుడతారా? అధికారికంగా ప్రకటన లేనప్పటికీ కూటమి నేతలు, స్థానిక రెవెన్యూ అధికారులు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు. స్థానికంగా రెండు రోజులుగా ఇదే చర్చ నడుస్తోంది. అయితే భూమి పూజ సమయంలో ఎవరైన ప్రశ్నిస్తే సమాధానం ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు రికార్డులను సిద్ధం చేసుకుంటున్నారు.
శృంగవరపుకోట, జూన్ 27(ఆంధ్రజ్యోతి):
పద్దెనిమిదేళ్ల క్రితం శృంగవరపుకోట మండలం కిల్తంపాలెం, మూలబొడ్డవర, చీడిపాలెం, చినఖండేపల్లి, ముషిడిపల్లి గ్రామాల పరిధిలో 834.66 ఎకరాలు అసైన్డ్ భూమి, 151.04 ఎకరాల ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 985.70 ఎకరాలను జిందాల్ యాజమాన్యానికి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ భూముల్లో ఇండస్ట్రీయల్ పార్కుల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈవిషయం తెలుసుకున్న భూ నిర్వాసితులు ముందు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు. కోర్టుల్లో కేసులు వేసారు. జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టిలో పెట్టారు. దీంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. అప్పట్లో జరిగిన భూ సేకరణ సమస్యలను ఒక్కొక్కటిగా తెలుసుకొనే ప్రయత్నం చేసింది. రైతుల నుంచి వినతిపత్రాలను స్వీకరించింది. జిందాల్ యాజమాన్యం, భూ నిర్వాసితుల మధ్య నలుగుతున్న సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యతలను జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనితకు అప్పగించింది. ఆమె గత నెల 20న విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో జేసీ ఎస్.సేతుమాదవ్, ఆర్డీవో సుధాసాగర్, తహసీల్దార్ డి.శ్రీనివాసరావు సమక్షంలో భూనిర్వాసిత రైతుల తరుపున పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, జెఎస్డబ్యూఇండస్ట్రీయల్ పార్కు వైఎస్ ప్రెసిడెంట్ రాచూరి కనకారావులతో చర్చలు జరిపారు. రైతుల ఆందోళనలు, అభ్యంతరాలను సానుకూల దృక్పథంలో పరిశీలించించేందుకు యాజమాన్యంతో చర్చించడంతో పాటు తగిన నిర్ణయం తీసుకోవాలని పరిశ్రమ ప్రతినిఽధికి సూచించారు. ఈ నెల 8న మరోసారి కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రామసుందర్ రెడ్డి భూనిర్వాసితులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని మాట ఇచ్చారు. మధ్యవర్తుల మాటలను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వానికి సహకరిస్తే అందరికీ మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ దఫా చర్చల్లో స్థానిక శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ కూడా పాల్గొన్నారు. అప్పటి నుంచి నిర్వాసిత రైతులు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు.
ఫ పలుమార్లు భూమి పూజకు సీఎం వస్తున్నట్లు పరిశ్రమల యాజమాన్యం చెబుతూ వచ్చింది. ఇలా గత ఐదారు నెలలుగా ఎప్పటికప్పుడు యాజమాన్య ప్రతినిధులు, అధికార పార్టీకి చెందిన కొంత మంది నేతలు చెబుతున్నప్పటికీ ప్రచారంగా మిగిలింది. అయితే ఈ దఫా పరిశ్రమల యాజమాన్యంతో పాటు స్థానిక అధికార పార్టీకి చెందిన నాయకులు, రెవెన్యూ అధికారుల నుంచి జూలై 3న భూమి పూజ జరగనున్నట్లు వినిపిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో అధికారక ప్రకటన వస్తుందంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ మాట చెప్పారని స్థానిక రెవెన్యూ అధికారొకరు తెలిపారు. భూసేకరణ గ్రామాల రికార్డులతో సిద్ధంగా వున్నామని చెప్పారు. కడప స్టీల్ ప్లాంటు శంకుస్థాపన సమయంలో అక్కడి నుంచి వర్చువల్గా భూమి పూజ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై రేపో, మాపో కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరగనుంది. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు ఎవరెవరిని భూమిపూజకు ఆహ్వానించాలన్న విషయంతో పాటు వర్చువల్ భూమిపూజకు జనసమీకరణ చేయాలా, వద్దా వంటి అంశాలను చర్చించనున్నారు.