MSME parks launched ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం
ABN , Publish Date - May 26 , 2026 | 12:05 AM
MSME parks launched నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకుంటోంది. ఎన్నికల హామీల్లో భాగంగా మరో హామీ కార్యరూపం దాల్చే దిశగా సోమవారం కీలక అడుగు పడింది. జిల్లాలో రెండు చోట్ల ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబునాయుడు అమరావతి నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశారు
ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం
రెండు చోట్ల వర్చువల్గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
కొండకరకాంలో హాజరైన ఎంపీ, విజయనగరం ఎమ్మెల్యే, కలెక్టర్
గుళ్లపాడులో పాల్గొన్న రాజాం ఎమ్మెల్యే, ఆర్డీవో
విజయనగరం రూరల్/ రేగిడి, మే 25(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకుంటోంది. ఎన్నికల హామీల్లో భాగంగా మరో హామీ కార్యరూపం దాల్చే దిశగా సోమవారం కీలక అడుగు పడింది. జిల్లాలో రెండు చోట్ల ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబునాయుడు అమరావతి నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి కొండకరకాం పంచాయతీలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేసున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా నుంచి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, కలెక్టర్ రామసుందర్రెడ్డి పాల్గొన్నారు. కొండకరకాంలో భారీ స్ర్కీన్ ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు శంకుస్థాపనను వీక్షించారు. ఆయన ప్రసంగాన్ని విన్నారు.
- రేగిడి మండలం గుళ్లపాడులో రూ.4.20కోట్లతో ఏర్పాటుచేయనున్న ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన కోసం రేగిడి ఎంపీడీవో కార్యాలయంలో శిలాఫలకం, స్ర్కీన్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, చీపురపల్లి ఆర్డీవో సుధారాణి పాల్గొన్నారు. దశలవారీగా గుళ్లపాడు ఎంఎస్ఎంఈ పార్కుకు రూ.15కోట్లు నిధులు వచ్చేలా, ఈప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి జరిగేలే సీఎం చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఏపీఐఐసీ డిప్యుటీ జోనల్ మేనేజర్ జయచంద్ర, తహసీల్దార్ ఈశ్వరరావు, ఎంిపీడీవో శ్యామలాకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఇంటికో పారిశ్రామికవేత్త రావాలి: కలెక్టర్
ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్త రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ రామసుందర్రెడ్డి అన్నారు. కొండకరకాం గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కునకు సోమవారం శంకుస్థాపన జరిగాక ఆయన మాట్లాడారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ, ఎంఎస్ఎంసీ పార్కులకు సంబంధించి చంద్రబాబు నిర్ణయం గొప్ప ఆర్థిక ప్రగతికి దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజరు కృష్ణప్రసాద్, ఆర్డీఓ సుధాసాగర్, ఎంపీడీఓ గంటా వెంకటరావు, తహసీల్దారు కూర్మనాథరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్వర్మ తదితరులు పాల్గొన్నారు.