Move to data center డేటా సెంటర్ కు కదలిక
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:25 AM
Move to data center భోగాపురం, పోలిపల్లి రెవెన్యూ పరిధిలో ఏర్పాటు కానున్న రిలయన్స్ డేటా సెంటర్కు కదలిక వస్తోంది. త్వరలోనే ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. పూసపాటిరేగ మండలం కోనాడ సమీపం నుంచి సముద్ర నీటిని సేకరించి ఆపై శుద్ధి చేసి పైపులైన్ల ద్వారా భోగాపురం తరలించేందుకు ఆలోచిస్తున్నారు.
డేటా సెంటర్ కు కదలిక
సముద్ర నీటి తరలింపుపై చర్చ
రూట్ మ్యాప్ను పరిశీలించిన జేసీ.. ‘రిలయన్స్’ ప్రతినిధులు
భోగాపురం/పూసపాటిరేగ, సెప్టెంబరు10(ఆంధ్రజ్యోతి): భోగాపురం, పోలిపల్లి రెవెన్యూ పరిధిలో ఏర్పాటు కానున్న రిలయన్స్ డేటా సెంటర్కు కదలిక వస్తోంది. త్వరలోనే ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. పూసపాటిరేగ మండలం కోనాడ సమీపం నుంచి సముద్ర నీటిని సేకరించి ఆపై శుద్ధి చేసి పైపులైన్ల ద్వారా భోగాపురం తరలించేందుకు ఆలోచిస్తున్నారు. దీనిపై సంస్థ ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ గురువారం చర్చించారు. ఆపై పూసపాటిరేగ, భోగాపురం ప్రాంతాల్లో రూట్మ్యాప్ను పరిశీలించారు. డేటా సెంటర్లో యంత్రాల కూలింగ్ కోసం నీరు అత్యధికంగా అవసరం. ఆ నీటిని పూసపాటిరేగ మండలం కోనాడ సమీప సముద్రం నుంచి సేకరించాలనుకుంటున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్నికల్ బృందం తొలుత కోనాడ తీరంలో గురువారం స్థల పరిశీలన చేసింది. అక్కడ నుంచి భోగాపురం, పోలిపల్లి వరకు స్థలాలను పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పోలిపల్లి, భోగాపురం తూర్పు, భోగాపురం పడమర ప్రాంతాల్లో 855 ఎకరాలను రిలయన్స్ డేటా సెంటర్ ప్రాజెక్టుకు కేటాయించినట్లు సమాచారం. రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడితో 1.5 గిగావాట్ సామర్థ్యంతో రిలయన్స్ డేటా సెంటర్ ప్రాజెక్టు నిర్మాణమయ్యే అవకాశం ఉంది. మొదటి దశలో పోలిపల్లిలో 500 మెగావాట్ల డేటా సెంటర్ను 2028 అక్టోబరు నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రెండో దశ 2030నాటికి పూర్తి కానుంది. కాగా డేటా సెంటర్కు పైపులైన్లు ఏవిధంగా ఏర్పాటు చేస్తే దగ్గరగా ఉంటుంది... స్థలం ఏమాత్రం అవసరం.. ఏవిధంగా పైపులైన్లు ఏర్పాటు చేయాలి.. తదితర అంశాలపై చర్చించారని తెలిసింది. వారి వెంట తహసీల్దార్ జి.హేమంత్కుమార్ ఉన్నారు.