చురుగ్గా మినీ రైతు బజారు పనులు
ABN , Publish Date - Jun 21 , 2026 | 11:45 PM
వీరఘట్టం మార్కెట్ యార్డు స్థలంలో చేపడుతున్న మినీ రైతు బజారు పనులు చురుగ్గా జరుగుతున్నాయి.
- పూర్తికావస్తున్న నిర్మాణం
- తీరనున్న కూరగాయల రైతుల కష్టాలు
వీరఘట్టం, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): వీరఘట్టం మార్కెట్ యార్డు స్థలంలో చేపడుతున్న మినీ రైతు బజారు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. త్వరలో పనులు పూర్తికానున్నాయి. వీరఘట్టంలో సుమారు 400 కుటుంబాలు కూరగాయల సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. రైతు బజారు లేకపోవడంతో పండిన కూరగాయలను పాతబస్టాండ్, అంబేడ్కర్ జంక్షన్ వద్ద విక్రయిస్తున్నారు. రోడ్ల పక్కన ప్రమాదకరంగా, వర్షంలోను, ఎండలోను అమ్ముతున్నారు. గతంలో మార్కెట్ యార్డు స్థలంలో కూరగాయలను అమ్మేందుకు అధికారులు తాత్కాలికంగా నిర్మాణాలు చేపట్టి వ్యాపారులను ప్రోత్సహించారు. కానీ, అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో మరలా వెనక్కి వచ్చి అంబేడ్కర్ జంక్షన్, పాత బస్టాండ్లోనే కూరగాయలు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కృషితో మినీ రైతు బజారు నిర్మాణం కోసం వ్యవసాయ మార్కెట్ యార్డు నిధులు సుమారు రూ.41 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో వీరఘట్టం మార్కెట్ యార్డు స్థలంలో రైతు బజారు పనులు చురుగ్గా సాగుతున్నాయి. వీటితో పాటు రైతులకు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. తాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. రైతు బజారు నిర్మాణం పూర్తయితే వీరి కష్టాలు తీరనున్నాయి. పనులు వేగంగా జరుగుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.