వీణ కళాకారులకు వైద్య పరీక్షలు
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:24 AM
పట్టణంలోని గొల్లపల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో శుక్రవారం స్థానిక వీణల తయారీ కళాకారులు, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరం నిర్వహించారు.
బొబ్బిలి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని గొల్లపల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో శుక్రవారం స్థానిక వీణల తయారీ కళాకారులు, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరం నిర్వహించారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో హస్తకళల తయారీదారులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలిసి తమకు వైద్య సేవలను అందించాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం.. చేతివృత్తుల వారికోసం ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించాలని కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశశరు. అందుకు అనుగుణంగా గొల్లపల్లిలో నిర్వహించిన వైద్య శిబిరంలో బొబ్బిలి, వాడాడలకు చెందిన 35 మంది కళాకారులు, వారి కుటుంబాల వారికి శిబిరంలో వివిధ విభాగాల వైద్యులు పరీక్షలు నిర్వహించారు. మందులను పంపిణీ చేశారు. డీఎంహెచ్వో జీవనరాణి వైద్య శిబిరాన్ని సందర్శించి, రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. అనంతరం వీణల తయారీ కేంద్రాన్ని సందర్శించి వారి వృత్తికి సంబంధించిన వివరాలతో పాటు ఆరోగ్య సమస్యలను వీణల కేంద్రం ఇన్చార్జి సర్వసిద్ది రామకృష్ణను అడిగి తెలుసుకున్నారు. వైద్యశిబిరంలో 99 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని, వారికి మందులను పంపిణీ చేశామని యూపీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ గొంగాడ సాయికుమార్ తెలిపారు. శిబిరంలో వైద్యులు సంతోషి, మనోజ్, కె.సుబ్రహ్మణ్య హరికృష్ణ, కృష్ణకుమార్ సేవలు అందించారని వివరించారు.