Measures to Protect Land భూముల రక్షణకు చర్యలు
ABN , Publish Date - Jul 25 , 2026 | 11:46 PM
Measures to Protect Land భూముల రక్షణకు ప్రభుత్వ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు యజమానికి తెలియకుండా భూ రికార్డుల దిద్దుబాటుకు వీలులేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీని అమలు చేయనుంది. పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలాన్ని ఎంపిక చేశారు. ఆ మండలంలోని 22 గ్రామాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.
పైలెట్ ప్రాజెక్టుగా గుమ్మలక్ష్మీపురం ఎంపిక
60 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశం
పార్వతీపురం, జూలై25(ఆంధ్రజ్యోతి): భూముల రక్షణకు ప్రభుత్వ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు యజమానికి తెలియకుండా భూ రికార్డుల దిద్దుబాటుకు వీలులేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీని అమలు చేయనుంది. పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలాన్ని ఎంపిక చేశారు. ఆ మండలంలోని 22 గ్రామాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. బ్లాక్చైన్ టెక్నాలజీ ద్వారా భూ సమాచారం ఎవరికీ అందుబాటులో లేకుండా లాక్ చేస్తారు. ఈ భూములకు సంబంధించి యజమానులకు తెలియకుండా క్రయ, విక్రయాలు జరిపే అవకాశం ఉండదు. సబ్ డివిజన్, మ్యుటేషన్ , భూములు రిజిస్ర్టేషన్ వంటివి ఏవీ జరగవు. ఏ ప్రక్రియ చేపట్టాలన్నా భూ హక్కుదారులకు ముందుగా వచ్చే ఓటీపీ చెబితేనే భూముల లాక్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాతే భూములను ఇతరులకు బదిలీ చేయడం, క్రయ, విక్రయాలు, వంటివి సాధ్యమవుతాయి. కాగా గుమ్మలక్ష్మీపురం మండలంలో ఎంపిక చేసిన 22 గ్రామాల్లో 60 రోజుల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ తర్వాత సర్వే సెటిల్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ డిజిటల్ సైన్ చేస్తారు. జాయింట్ కలెక్టర్ డిజిటలైజేషన్ చేసిన అనంతరం భూ హక్కుదారులకు కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలను అందిస్తారు. పైలెట్ ప్రాజెక్టులో ఏమైనా లోపాలు, అభ్యంత రాలుంటే ఎలా సవరించాలో పరిశీలిస్తారు. మొత్తంగా ఇది విజయవంతమైతే జిల్లావ్యాప్తంగా అమలు చేయనున్నారు. దీనిపై జిల్లా సర్వే అండ్ సెటిల్మెంట్ అధికారి విఘ్నేశ్వరరావును వివరణ కోరగా.. ‘ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బ్లాక్ చైన్ టెక్నాలజీలో భాగంగా 60 రోజుల్లో భూ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాం. ఈ విధానం.. భూ హక్కుదారులకు ఎంతో మేలు జరుగుతుంది. యజమాని అనుమతి లేకుండా భూ వివరాలు పొందడం ఎవరికీ సాధ్యం కాదు. వారికి తెలియకుండా భూముల మ్యుటేషన్, సబ్ డివిజన్ తదితర ప్రక్రియలు జరిగే అవకాశం ఉండదు. ’ అని తెలిపారు.