May good days come..! మంచిరోజులు రావాలని..!
ABN , Publish Date - May 01 , 2026 | 12:28 AM
May good days come..! కార్మికులు పుట్టినరోజును మరిచిపోతారేమో కాని మేడేను మరువనే మరువరు. ఆ రోజు వారికి ఓ పండుగ. ఎర్రజెండాను చేత పట్టుకుని వీధుల్లోకి వెళ్లి హర్షం వ్యక్తం చేయడం.. తమ మనుగడకు కారణమైన జెండాను ఎలుగెత్తి చాడడం అంటే వారికి ఎంతో ఇష్టం. తమ బలం, బలగం, నమ్మకం, విశ్వాసం ఎర్రజెండానే. జిల్లాలో ఒకప్పుడు ఎటు చూసినా కార్మికలోకమే కనిపించేది. పరిశ్రమలతో ఆయా ప్రాంతాలన్నీ కళగా ఉండేవి.
మంచిరోజులు రావాలని..!
ఆశగా ఎదురుచూస్తున్న కార్మికులు
జిల్లాలో చాలా పరిశ్రమల మూత
కోలుకోని జూట్ ఇండస్ట్రీ
వలసబాట పట్టిన పేదలు
నేడు మే డే
కార్మికులు పుట్టినరోజును మరిచిపోతారేమో కాని మేడేను మరువనే మరువరు. ఆ రోజు వారికి ఓ పండుగ. ఎర్రజెండాను చేత పట్టుకుని వీధుల్లోకి వెళ్లి హర్షం వ్యక్తం చేయడం.. తమ మనుగడకు కారణమైన జెండాను ఎలుగెత్తి చాడడం అంటే వారికి ఎంతో ఇష్టం. తమ బలం, బలగం, నమ్మకం, విశ్వాసం ఎర్రజెండానే. జిల్లాలో ఒకప్పుడు ఎటు చూసినా కార్మికలోకమే కనిపించేది. పరిశ్రమలతో ఆయా ప్రాంతాలన్నీ కళగా ఉండేవి. నేడు ఆ పరిస్థితి లేదు. అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో కార్మికులు ప్రత్యామ్నాయ ఉపాధి బాట పట్టారు. కానీ మనసులో ఎక్కడో చిన్న ఆశ. మళ్లీ పరిశ్రమలు తెరుచుకుంటాయని, కొత్త రోజులు వస్తాయని ఎదురుచూస్తున్నారు. ఆ ఆశతో మేడేను జరుపుకోనున్నారు.
బొబ్బిలి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి):
నాయకుల త్యాగఫలితంగా ఆవిర్భవించిన మే డేను జిల్లా అంతటా కార్మికులు ఘనంగా జరుపుకోనున్నారు. అయితే ఒకనాటి ఆనందం వారి కళ్లలో కరువైంది. పాలకులు, యాజమాన్యాలు కలిసికట్టుగా కార్మికులకు నేటికీ తీరని అన్యాయం చేస్తున్నారన్నది వారి ఆవేదన. కాస్తో కూస్తో ప్రయోజనకరంగా ఉండే కార్మిక చట్టాలను మార్చడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. లేబర్ కోడ్లను తెచ్చి కార్మికులను ముచ్చెమటలకు గురిచేస్తున్నారని, పనిభారం పెంచేసి ఉద్యోగభద్రత లేకుండా చేస్తున్నారని కార్మిక నేతలు, సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. పరిశ్రమలు మూతపడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. ఇక్కడో ఫ్యాక్టరీయో, మిల్లో ఉండేదని చెప్పుకునే స్థితి జిల్లాలో చాలా చోట్ల నెలకొంది.
హామీలిచ్చి.. విస్మరించి
2019 ఎన్నికల సమయంలో సీఎం జగన్తో పాటు వైసీపీ నాయకులు ఊరూరా తిరిగి మూతపడ్డ పరిశ్రమలను తెరిపిస్తామని, కార్మికులకు ఉపాధిని పునరుద్ధరిస్తామని బీరాలు పలికారు. మిల్లులు తెరవలేదు సరికదా ఏకంగా వాటిని పూర్తిగా నేలమట్టం చేసి రియల్ఎస్టేట్లుగా మార్చుకునేందుకు వైసీపీ నాయకులే యాజమాన్యాలకు సంపూర్ణ సహకారం అందించారు. ఫలితంగా బొబ్బిలి ప్రాంతంలో మూడు జూట్మిల్లులు, పంచదార పరిశ్రమ మూతపడింది. ఆ ప్రభావం కార్మికుల కుటుంబాలపై బలంగా పడింది. ఉపాధిని కోల్పోయిన కార్మికులు వలసబాట పట్టారు. సుమారు ఐదు వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఉపాధి కోల్పోయిన కార్మికులను పలకరిస్తే వారి వ్యథాభరితమైన జీవితగాథలను ఏకరువు పెడుతున్నారు. కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఫ గ్రోత్సెంటరులో కొత్త పరిశ్రమల ఉనికి కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఉన్న కొద్దిపాటి ఫ్యాక్టరీలలో కొన్నింటిని రేపోమాపో మూసేందుకు సిద్ధమవుతున్నారు. విద్యుత్ చార్జీల భారం అధికం కావడం, ప్రభుత్వ ప్రోత్సాహం లేక పారిశ్రామిక రంగం దాదాపుగా కునారిల్లిపోతోంది. జూట్ పరి శ్రమలో ఉన్న అనుభవం దృష్ట్యా నెలిమర్ల, గుంటూరు ప్రాంతాలకు కార్మికులు వలసబాట పట్టారు.
మాటలకే పరిమితమైన ప్రభుత్వం
పి.శంకరరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు, బొబ్బిలి
1200 మంది జూట్ కార్మికులకు చెందిన పీఎఫ్ 1.63 కోట్ల రూపాయలను ఓ ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించాలి. వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కలిసి మధ్యవర్తిత్వం చేసి జూట్కార్మికులను నిలువునా ముంచారు. తీరని అన్యాయం చేశారు. ఆ తర్వాత కూడా అనేక పరిశ్రమలు మూతపడి వేలాది మంది కార్మికులు వలస బాట పట్టారు. జూట్ పరిశ్రమల ఉనికి పూర్తిగా కనుమరుగైంది. పారిశ్రామిక ఉద్ధరణ జరగడం లేదు. చెరకు రైతులు, కార్మికుల పరిస్ధితి కూడా చాలా దయనీయంగా ఉంది. కూటమి ప్రభుత్వం తీరు కూడా మాటలకే పరిమితం అవుతోంది.
---------------