Child Murder Case చిన్నారి హత్య కేసులో వ్యక్తికి యావజ్జీవ శిక్ష
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:12 AM
Man Sentenced to Life Imprisonment in Child Murder Case గుమ్మలక్ష్మీపురం మండలంలో ఐదేళ్ల కిందట జరిగిన మూడేళ్ల చిన్నారి హత్య కేసులో ఓ వ్యక్తికి యావజ్జీవ కఠిన కారాగార శిక్షతో పాటు రూ.11 వేలు జరిమానా విధిస్తూ.. విజయనగరం మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి ఎం.మీనాదేవి తీర్పు ఇచ్చారు. మంగళవారం పార్వతీపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు.
గుమ్మలక్ష్మీపురం, మార్చి10(ఆంధ్రజ్యోతి): గుమ్మలక్ష్మీపురం మండలంలో ఐదేళ్ల కిందట జరిగిన మూడేళ్ల చిన్నారి హత్య కేసులో ఓ వ్యక్తికి యావజ్జీవ కఠిన కారాగార శిక్షతో పాటు రూ.11 వేలు జరిమానా విధిస్తూ.. విజయనగరం మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి ఎం.మీనాదేవి తీర్పు ఇచ్చారు. మంగళవారం పార్వతీపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి ఈ కేసు వివరాలను వెల్లడించారు.
పెంగువ గ్రామానికి చెందిన కిల్లక పార్వతి తన మూడేళ్ల చిన్నారితో కలిసి జీవనం సాగిస్తుండేది. అయితే కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తన అక్క పార్వతి కూతురైన చిన్నారిపై వినోద్ అక్కసు పెంచుకున్నాడు. 2021, జూన్ 11న రాత్రి ఇంటి వరండాలో వారు నిద్రిస్తుండగా వినోద్ పదునైన కత్తితో చిన్నారి గొంతు కోసేశాడు. చిన్నారి ఏడుపు విని పార్వతి మేల్కొని కేకలు వేసింది. దీంతో వినోద్ అక్కడ నుంచి తప్పించుకున్నాడు. గొంతుపై తీవ్ర గాయం కావడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎల్విన్పేట ఎస్ఐ కృష్ణప్రసాద్ కేసు నమోదు చేశారు. అప్పట్లో ఎల్విన్పేట సీఐ తిరుపతిరావు దర్యాప్తు చేపట్టారు. 2021 జూన్ 14న వినోద్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. వినోద్ చేసిన నేరం రుజువు కావడంతో న్యాయాధికారి శిక్షను ఖరారు చేశారు. జరిమానా చెల్లించకపోతే యావజ్జీవంతో పాటు అదనంగా ఏడు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ తెలిపారు.