తాటిపూడి రిజర్వాయర్ కుండీలో పడి వ్యక్తి మృతి
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:13 AM
తాటిపూడి రిజర్వాయర్ కుండీలో పడి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
గంట్యాడ, జూన్ 20(ఆంధ్రజ్యోతి): తాటిపూడి రిజర్వాయర్ కుండీలో పడి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్ఐ సాయికృష్ణ శనివారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్.కోట మండలం సీతారామపురం గ్రామానికి చెందిన కొల్లి దశరధ రామునా యుడు(29) తన వరుసకు మేనమామ అయిన నాయుడుతో కలిసి శుక్రవారం తాటిపూడి రిజర్వాయర్ వద్దకు వచ్చాడు. అక్కడ వారిద్దరూ కాసేపు సరదాగా గడిపారు. ఈ తరుణంలో నాయుడు కుండీ గట్టుపై విశ్రాంతి తీసుకుని నిద్రలోకి జారుకున్నాడు. ఇదే సమయంలో రామునాయుడు కుండీలో స్నానం చేయడానికి దిగి.. ప్రమాదవ శాత్తు మునిగిపోయాడు. నాయుడుకు నాలుగు గంటల తర్వాత మెలుకువ వచ్చింది. వెంటనే రామునాయుడు కోసం వెతికాడు. కనిపించకపోవడంతో ఇంటికి వెళ్లిపోయి ఉంటాడని అనుకున్నాడు. సీతారామపురం గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని తెలిపాడు. అయితే శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కుండీలో రామునాయుడి మృతదేహం బయటపడింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. రామునాయుడు ఎస్.కోట ఆర్టీసీ డిపోలో మెకానిక్గా పనిచేస్తున్నాడు.