సీఎం పర్యటనను విజయవంతం చేయండి: ఎమ్మెల్యే బగ్గు
ABN , Publish Date - May 13 , 2026 | 12:26 AM
సీఎం నారా చంద్రబాబునాయుడి నరసన్నపేట పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు.
నరసన్నపేట, మే 12(ఆంధ్రజ్యోతి): సీఎం నారా చంద్రబాబునాయుడి నరసన్నపేట పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో క్లస్టర్, యూనిట్ ఇన్చార్జ్లు, రాష్ట్ర, జిల్లా, మండల పార్టీ కార్యవర్గ సభ్యులతో విస్తృతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన ద్వారా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే మంచి అవకాశం లభిస్తుందని చెప్పారు. పార్టీ బలోపేతానికి గ్రామస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని అన్నారు. నాయకులంతా సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి బగ్గు అర్చన మాట్లాడుతూ మహిళలు, యువత పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అందరి కృషితో పార్టీ విజయాలకు బాటలు వేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు తామరాపల్లి, జమ్ము జంక్షన్ వద్ద హెలీప్యాడ్లను, ఎస్వీఎల్ రైస్ మిల్లు వద్ద మైదానం ప్రాంతాలను అధికారులతో కలసి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై చర్చించారు.