సెంట్రల్ జైలులో జీవిత ఖైదీ మృతి
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:17 AM
విశాఖ కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ అనారోగ్యంతో మృతిచెందినట్టు ఆరిలోవ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
మృతుడిది పార్వతీపురం రెల్లివీధి
విశాఖపట్నం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): విశాఖ కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ అనారోగ్యంతో మృతిచెందినట్టు ఆరిలోవ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలోని రెల్లివీధికి చెందిన సొండి చిన అప్పలస్వామి (62) హత్యా నేరంలో ముద్దాయిగా రుజువు కావడంతో 2016 ఆగస్టులో కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈమేరకు విశాఖ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. గత ఏడాది పక్షవాతం రావడంతో కేజీహెచ్లో చికిత్స అందించారు. ఆరోగ్యం కుదుట పడడంతో తిరిగి జైలుకు తరలించారు. గత ఏడాది జూన్లో కిడ్నీ వ్యాధికి గురవడంతో మళ్లీ కేజీహెచ్లో చికిత్స అందించారు. ఈ క్రమంలో మార్చి 6న ఇతడికి కోర్టు మూడు నెలల బెయిల్ ఇచ్చింది. గడువు ముగియడంతో ఈనెల ఆరో తేదీన తిరిగి జైలుకు వచ్చాడు. కాగా సోమవారం అస్వస్థతకు గురై నిద్రిస్తున్న బెడ్పైనే విగతజీవిగా మారాడు. ఉదయం ఆరు గంటల సమయం లో గుర్తించిన జైలు సిబ్బంది కేజీహెచ్కు తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతదేహానికి అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించారు. కాగా మృతుడికి వివాహమైన ఇద్దరు కుమార్తెలున్నారు.