CM Chandrababu: కార్యకర్తల కష్టాన్ని వృథా కానివ్వం
ABN , Publish Date - Feb 28 , 2026 | 11:58 PM
CM Chandrababu: ‘కార్యకర్తలు పార్టీకి ఊపిరి. వారి కష్టానికి తగిన సమయంలో తగిన గుర్తింపు ఉంటుంది.’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు.
వారికి తగిన గుర్తింపు కచ్చితంగా ఉంటుంది
సమస్యలు తెలిపేందుకు త్వరలోనే ప్రత్యేక యాప్
పార్టీ శ్రేణుల సమావేశంలో సీఎం చంద్రబాబు
చీపురుపల్లి/గుర్ల, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ‘కార్యకర్తలు పార్టీకి ఊపిరి. వారి కష్టానికి తగిన సమయంలో తగిన గుర్తింపు ఉంటుంది.’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. రావివలసలో శనివారం మధ్యాహ్నం పార్టీ శ్రేణులతో ఆయన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ కోసం పని చేసిన వారిని తాను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానన్నారు. ‘గెలిచామన్న ధీమాలో కొంతమంది ప్రజలకు దూరంగా ఉంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నిరంతరం ప్రజల్లో ఉండాలి. పార్టీ విషయంలో గతంలో కొన్ని పొరపాట్లు జరిగాయి. అటువంటివి పునరావృతం కాకుండా చూస్తా. కార్యకర్తలు లేకుంటే పార్టీ లేదు. కార్యకర్తలు ఆర్థికంగా బలోపేతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా తాను ఆలోచన చేస్తున్నా. మీ సమస్యలు పార్టీకి నేరుగా తెలియజేసేందుకు ఒక ప్రత్యేక యాప్ను తెస్తాం. త్వరలోనే ఆ యాప్ను అందుబాటులోకి వస్తుంది. గతంలో కంటే పార్టీకి 8 శాతం ఆదరణ పెరిగింది. నాయకులు, కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.’ అని హితవు పలికారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే, ఎంపీ, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.