jai sriram శోభాయమానంగా శోభాయాత్ర
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:40 AM
jai sriram
శోభాయమానంగా శోభాయాత్ర
రామతీర్థం నుంచి సీతారామలక్ష్మణ విగ్రహాలతో బయలుదేరిన బృందం
భక్తుల కోలాటాలు, భజనలు, కీర్తనలతో కోలాహలం
సర్వత్రా రామనామస్మరణ
ఊరేగింపులో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు
వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం గోదావరిలో నిమజ్జనం
నెల్లిమర్ల, ఏప్రిల్ 13(ఆంద్రజ్యోతి):
రామతీర్థం నుంచి సోమవారం ఉదయానే నాడు ధ్వంసమైన శ్రీరాముడి విగ్రహంతోపాటు సీత, లక్ష్మణ విగ్రహాలతో శోభాయాత్ర వైభవంగా మొదలైంది. భక్తుల కోలాటాలు, భజనలు, కీర్తనల నడుమ కోలాహలంగా ముందుకు సాగింది. ప్రారంభంలో మంత్రి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అదితిగజపతిరాజు, నాగమాధవి, నడికుదిటి ఈశ్వరరావు పాల్గొని కొద్దిదూరం వరకూ పాదయాత్ర చేశారు. జైశ్రీరామ్ అంటూ నినదించారు. తొలుత రామతీర్థం నుంచి వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం విగ్రహాలను ప్రత్యేక వాహనంలోకి తీసుకువెళ్లారు. ఈవో వై.శ్రీనివాసరావు పర్యవేక్షణలో కార్యక్రమం మొదలైంది. నెల్లిమర్ల జంక్షన్కు చేరాక కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై గోదావరి జిల్లాల వైపుగా కదిలారు. సాయంత్రం ముందుగా నిర్ణయించిన ముహూర్త సమయానికి గోదావరిలో కోటిపల్లి రేవు వద్ద వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం విగ్రహాలను నిమజ్జనం చేశారు. జిల్లాలో మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, టీడీపీ విశాఖ నార్త్ పరిశీలకుడు సువ్వాడ రవిశేఖర్, టీడీపీ మండల అధ్యక్షుడు కడగల ఆనంద్కుమార్, నాయకులు గేదెల రాజారావు, తాడ్డి సత్యనారాయణ, లెంక అప్పలనాయుడు, కోటపాటి తిరుపతిరావు, జనసేన పార్టీ నాయకులు లోకం ప్రసాద్, చనమల్ల వెంకటరమణ, కరుమోజీ గోవిందరావు, నవగట్ల పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆ దారుణాలను ప్రజలు మరిచిపోలేరు
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం రూరల్, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాల్లో ధ్వంసం జరిగిన సంఘటనలను ప్రజలు, భక్తులు మరిచిపోలేరని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. కోదండరాముడు, సీతమ్మ, లక్ష్మణమూర్తుల విగ్రహాలను గోదావరిలో జలాధివాసం చేసేందుకు సోమవారం రామతీర్థం నుంచి బయలుదేరిన విగ్రహాల ఊరేగింపు ఉదయం 7 గంటలకు విజయనగరంలోని పైడిమాంబ ఆలయానికి చేరుకుంది. అక్కడ కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, లోకం నాగమాధవి, ఎన్.ఈశ్వర రావులు విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రథాల ధ్వంసం సంఘటనలు జరిగాయన్నారు. 108 దేవాలయాలకు చైర్మన్గా ఉన్న అశోక్ గజపతిరాజును సైతం ఆ ప్రభుత్వం అవమానించిందన్నారు.
రైటప్