Share News

It is time for the cane cutting mills కర్ర కోత మిల్లులకు టైమొచ్చింది

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:18 AM

It is time for the cane cutting mills వంట గ్యాస్‌కు పెరిగిన డిమాండ్‌తో కర్ర కోత(మిల్లులు) మిల్లులకు జనం క్యూ కడుతున్నారు. గ్యాస్‌ బుకింగ్‌ చేసిన 25 రోజుల తరువాతే డెలివరీ అవుతుండడంతో సింగిల్‌ సిలిండర్‌లు ఉన్న వారు కట్టెల పొయ్యిలనే నమ్ముకుంటున్నారు. దీంతో కొత్తవలసలోని కర్ర కోత(మిల్లులు) మిల్లులు కొద్దిరోజులుగా ఖాళీ లేకండా పనిచేస్తున్నాయి. గతంలో ఒక పూట కర్రలు కోస్తే రెండో పూట ఖాళీగా ఉండే ఈ మిల్లుల యజమానులకు చేతినిండా పని దొరికింది.

It is time for the cane cutting mills కర్ర కోత మిల్లులకు   టైమొచ్చింది
కొత్తవలసలోని సామిల్లులో కర్రలు కోస్తున్న దృశ్యం

కర్ర కోత మిల్లులకు

టైమొచ్చింది

గ్యాస్‌ కొరతతో వాటికి పెరిగిన డిమాండ్‌

విపరీతంగా అమ్ముడవుతున్న వంటచెరుకు

20 కేజీలు రూ. 120కు పెరిగిన ధర

గతంలో రూ.40కే లభ్యం

కొత్తవలస, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి) :

వంట గ్యాస్‌కు పెరిగిన డిమాండ్‌తో కర్ర కోత(మిల్లులు) మిల్లులకు జనం క్యూ కడుతున్నారు. గ్యాస్‌ బుకింగ్‌ చేసిన 25 రోజుల తరువాతే డెలివరీ అవుతుండడంతో సింగిల్‌ సిలిండర్‌లు ఉన్న వారు కట్టెల పొయ్యిలనే నమ్ముకుంటున్నారు. దీంతో కొత్తవలసలోని కర్ర కోత(మిల్లులు) మిల్లులు కొద్దిరోజులుగా ఖాళీ లేకండా పనిచేస్తున్నాయి. గతంలో ఒక పూట కర్రలు కోస్తే రెండో పూట ఖాళీగా ఉండే ఈ మిల్లుల యజమానులకు చేతినిండా పని దొరికింది.

వంట గ్యాస్‌ కొరత లేనంత కాలం కర్ర కోతల మిల్లుల వద్ద వంట చెరుకు కేజీ రెండు రూపాయలకు మాత్రమే దొరకేది. సమస్య రావడంతో ఇప్పుడు కేజీ వంట చెరుకు రూ.6కు పెరిగి పోయింది. సాధారణంగా వంటచెరుకును పట్టు పేరుతో విక్రయిస్తుంటారు. పట్టు అంటే 20 కిలోలు. గతంలో పట్టు ధర రూ.40 ఉంటే ఇప్పుడు రూ.120కి పెరిగిపోయింది. గ్రామాల నుంచి ఎటువంటి కర్ర వచ్చినా కోత కోయడంతో ఎప్పటికప్పుడు కోసిన వంట చెరుకు స్టాక్‌లేకుండా అయిపోతోంది. గ్రామాల్లో వంటచెరుకు సమస్య లేకపోయినా కొత్తవలస వంటి మండల కేంద్రంలో వంట చెరుకు సమస్య ఉంది. స్థానికులు కర్ర కోత మిల్లులను అధికంగా ఆశ్రయిస్తున్నారు. కొత్తవలసలోని ఏ కర్రల మిల్లులో చూసినా వంట చెరుకుకు కూడా నో స్టాక్‌ కనిపిస్తోంది. వంట చెరుకుకే కాకుండా కర్రలు కోయడం ద్వారా వచ్చే రంపపు పొట్టుకు కూడా డిమాండ్‌ పెరిగిపోయింది. గతంలో ప్రతిసామిల్లు వద్ద రంపపు పొట్టు కొండల మాదిరిగా కుప్పలు కుప్పలుగా ఉండేది. పాత రోజుల్లో రంపపు పొట్టుతో పొయ్యిలు ఉండేవి. గ్యాస్‌ వాడకం పెరిగిన తరువాత ఈ పొయ్యిలు కూడా కనుమరుగయ్యాయి. మళ్లీ పొట్టుతో వంటలు చేసుకునేందుకు పొయ్యిలు సిద్ధం చేస్తున్నారు. ఈ రంపపు పొట్టును కూడా వంట చేసుకునేందుకు పట్టుకుపోతున్నారు.

ఫ చిన్న చిన్న హోటళ్లలో గతంలో డొమిస్టిక్‌ సిలిండర్లతో వంటలు చేసేవారు. అధికారులు చూసీచూడనట్టు వదిలేయడంతో వ్యాపారం సాగేది. గ్యాస్‌ సమస్య రావడంతో అధికారులు నిఘా పెట్టారు. దీంతో హోటళ్ల యజమానులు కట్టెల పొయ్యిలనే ఆశ్రయిస్తున్నారు. సామిల్లుల వద్దకు వెళ్లి కొనుగోలు చేసుకుని అరకొర వ్యాపారాలు చేసుకుంటున్నారు.

బ్లాక్‌లో గ్యాస్‌ ధర 2000

అత్యవసరంగా గ్యాస్‌ కావాల్సి వస్తే కొత్తవలస ప్రాంతంలో ఒక సిలిండర్‌ రూ.2000కు విక్రయిస్తున్నట్లు సమాచారం. గ్యాస్‌ బుక్‌ చేసి ఓటీపీలు వచ్చినా సరఫరా చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొత్తవలసలో ఒక గ్యాస్‌ కంపెనీకి రెండు ఏజెన్సీలు ఉన్నాయి. వీటి ద్వారా గ్యాస్‌ సకాలంలో సరఫరా చేయడంలేదంటున్నారు. అధికారులు చొరవ తీసుకుని బ్లాక్‌లో గ్యాస్‌ విక్రయాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Apr 07 , 2026 | 12:18 AM