It ends with an apology! సారీతో సరి!
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:16 AM
It ends with an apology! బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు తల్లిదండ్రులు నిలదీయడంతో సారీ చెప్పి సస్పెన్షన్కు గురై, పోక్సో కేసు నుంచి తప్పించుకున్నారో ఉపాధ్యాయుడు. అందరి సమక్షంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని రక్తం వచ్చేలా గాయపరచి, పోలీస్స్టేషన్లో రాజీ చేసుకుని సారీ చెప్పి దర్జాగా బయటపడ్డాడో యువకుడు. సభ్య సమాజం చీత్కరించేలా జరిగిన ఈ రెండు ఘటనలకు రాజాం మున్సిపాలిటీ పరిధిలోని డోలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికైంది. ఈ రెండు ఘటనలను పరిశీలిస్తే..
సారీతో సరి!
తప్పుచేయడం.. క్షమాపణ చెప్పడం..
డోలపేట ఉన్నత పాఠశాలలో దుస్థితిది
రాజాం రూరల్, జులై 13(ఆంధ్రజ్యోతి): బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు తల్లిదండ్రులు నిలదీయడంతో సారీ చెప్పి సస్పెన్షన్కు గురై, పోక్సో కేసు నుంచి తప్పించుకున్నారో ఉపాధ్యాయుడు. అందరి సమక్షంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని రక్తం వచ్చేలా గాయపరచి, పోలీస్స్టేషన్లో రాజీ చేసుకుని సారీ చెప్పి దర్జాగా బయటపడ్డాడో యువకుడు. సభ్య సమాజం చీత్కరించేలా జరిగిన ఈ రెండు ఘటనలకు రాజాం మున్సిపాలిటీ పరిధిలోని డోలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికైంది. ఈ రెండు ఘటనలను పరిశీలిస్తే..
డోలపేట జిల్లా పరిషత్ పాఠశాలలో విధులు నిర్వహించిన ఓ ఉపాధ్యాయుడు అదే పాఠశాలలో చదువుతున్న బాలిక పట్ల ఈ ఏడాది జనవరిలో అసభ్యకరంగా ప్రవర్తించారు. కోపోద్రిక్తులైన గ్రామపెద్దలు, కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకుని ఆందోళన చేశారు. ఆ ఉపాధ్యాయుడిని నిలదీశారు. బాలిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. శాఖాపరమైన దర్యాప్తు నిర్వహించిన విద్యాశాఖ అధికారులు ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. పోక్సో కేసు నమోదు చేయాల్సిన పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు.
నేడిలా...
ఇదే పాఠశాలలో తాజాగా ఈనెల 10న చోటుచేసుకున్న ఘటన సంచలనమైంది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయినిని పాఠశాలకు కారులో డ్రాప్ చేసేందుకు వచ్చిన ఆమె కుమారుడు (హెడ్ కానిస్టేబుల్ కొడుకు) గేటుకు ఎదురుగా కారు పెట్టడంతో చెలరేగిన వివాదం మరో ఉపాఽధ్యాయుడిపై దాడి చేసేంతవరకు దారితీసింది. అడ్డంగా ఉన్న కారును తీయాలని పీఈటీ ఆ యువకుడికి సూచించగా పట్టించుకోని ఆ యువకుడు మరికొద్దిసేపు కారులోనే గడిపి ఆపై గ్రౌండ్లో ప్రేయర్ జరుగుతున్న ప్రదేశానికి చేరుకుని ‘నీకు కామన్సెన్స్ ఉందా’ అంటూ పీఈటీ సుజాతపై విరుచుకుపడ్డాడు. అక్కడే ఉన్న మరో ఉపాధ్యాయుడు లాభాన వేణు ఆ యువకుడిని వారిస్తూ వెళ్లిపోమని సూచించాడు. ఇది తట్టుకోలేని ఆ యువకుడు హెడ్కానిస్టేబుల్ అయిన తన తండ్రి రాజుకు ఫోన్లో వివరించాడు. పాఠశాలకు చేరుకున్న ఆయన కొడుకుతో కలిసి హెచ్ఎం గదిలోకి వెళ్లాడు. ఉపాధ్యాయులంతా సంతకాలు పెట్టే పనిలో ఉండగా ఉపాధ్యాయుడు వేణుపై ఆ యువకుడు దాడికి దిగాడు. హఠాత్పరిణామాన్ని ఊహించని ఉపాధ్యాయులు కంగుతిన్నారు. ఘటనపై హెచ్ఎం ఆర్వీజీఎన్ మురళీకృష్ణ పోలీసులు ఫిర్యాదు చేశారు. గాయపడిన వేణు రాజాం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. షరా మామూలుగానే కొంతమంది పెద్దలు రంగంలోకి దిగారు.. భవిష్యతును బూచిగా చూపించారు. రాజీమార్గాన్ని ఎంచుకున్నారు.. ఉపాధ్యాయుడిని గాయపరిచిన ఆ యువకుడు పాఠశాల గ్రౌండ్లో ప్రేయర్ సమయంలో విద్యార్థులందరి సమక్షంలో ఉపాధ్యాయులకు సారీ చెప్పించారు.
డీఎస్పీ దర్యాప్తు
ఈనెల 10న డోలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఘటనపై చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు సోమవారం దర్యాప్తు నిర్వహించారు. హెచ్ఎం మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాఠశాలకు వచ్చిన ఆయన హెచ్ఎంతో పాటు ఘటన జరిగిన సమయంలో ఉన్న ఉపాధ్యాయులు భాను, హైమావతి, ధనలక్ష్మి, సుజాత, ఉపేంద్ర, వేణుగోపాల్ తదితరులతో సమావేశమయ్యారు. ఆరోజు ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.