Road Works in Hilltop Villages గిరిశిఖర గ్రామాల్లో రోడ్డు పనులు ఇంతేనా?
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:28 AM
Is This the State of Road Works in Hilltop Villages? గిరిజనులకు డోలీ మోతలు తప్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గిరిశిఖర గ్రామాల్లో రహదారుల నిర్మాణాలకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తోంది. ఈ మేరకు సీతంపేట మన్యంలోని శరవేగంగా రహదారి నిర్మాణాలు జరుగుతు న్నాయి. అయితే ఐటీడీఏ పరిధిలోని గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న సీసీ రహదారుల నిర్మాణాలపై మాత్రం అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పర్యవేక్షించని ఇంజనీరింగ్శాఖ
పెదవి విరుస్తున్న గిరిజనులు
సీతంపేట రూరల్, జూన్ 14(ఆంధ్రజ్యోతి): గిరిజనులకు డోలీ మోతలు తప్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గిరిశిఖర గ్రామాల్లో రహదారుల నిర్మాణాలకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తోంది. ఈ మేరకు సీతంపేట మన్యంలోని శరవేగంగా రహదారి నిర్మాణాలు జరుగుతు న్నాయి. అయితే ఐటీడీఏ పరిధిలోని గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న సీసీ రహదారుల నిర్మాణాలపై మాత్రం అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఎన్ఆర్ఈజీఎస్ మెటీరియల్ కాంపొనెంట్ నిధులతో చేపడుతున్న వివిధ నిర్మాణ పనుల్లో పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల కొందరు ఐటీడీఏ పీజీఆర్ఎస్లో కూడా ఫిర్యాదు చేశారు. సీతంపేట మన్యంలో నాయుడుగూడ నుంచి జాతాపు జగతిపల్లి వరకు సుమారు 1200మీటర్ల మేర రహదారి నిర్మాణాన్ని ఇటీవల ప్రారంభించారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.80లక్షలతో చేపడుతున్న ఈ సీసీ రహదారి పనులు నాసిరకంగా జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనల మేరకు నాలుగు ఇంచీల వరకు జీఎస్బీ(గ్రాన్యులర్ సబ్ బేస్)వేసి ఆపై వైబ్రెటర్ రోలర్తో రోలింగ్ చేయాలి. అనంతరం క్యూరింగ్ చేసి జీఎస్బీ సెట్ అయిన తరువాత ఇంజనీరింగ్ అధికారుల పరిశీలించాలి. వారి అనుమతితో సీసీ(కాంక్రీట్)నిర్మాణ పనులు ప్రారంభించాల్సి ఉంది. కానీ ఈరహదారి పనుల్లో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. గిరిశిఖర ప్రాంత కావడంతోఇంజనీరింగ్శాఖ ఏఈ, డీఈఈ, ఈఈ స్థాయి అధికారులెవరూ ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారనే ఆరోపణలున్నాయి. కాగా ఇంతవరకు వేసిన సీసీ రహదారిపై వాటరింగ్ కూడా సక్రమంగా చేయకపోవడంపై ఆయా గ్రామాల గిరిజనులు మండిపడుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.
డీఈఈ ఏమన్నారంటే..
గిరిశిఖర ప్రాంతంలో నాయుడుగూడ నుంచి జాతాపు జగతిపల్లి వరకు నిర్మిస్తున్న రహదారి పనులను మా సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఆ రోడ్డుపై వేసిన జీఎస్బీని రోలింగ్ చేసేందుకు కొండపైకి రోలర్ వెళ్లని కారణంగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాం. నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టాలని ఆదేశించాం. గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్శాఖ ఇన్చార్జి డీఈఈ నాగభూషణం తెలిపారు.