సాగునీటి గండం
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:47 AM
తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా మడ్డువలస జలాశయ నీటి మట్టం ఆందోళనకర స్థాయికి చేరుకుంది.
- మడ్డువలస జలాశయంలో డెడ్ స్టోరేజ్
- 61.96 మీటర్లకు పడిపోయిన నీటిమట్టం
- ఆందోళన చెందుతున్న రైతులు
వంగర , ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా మడ్డువలస జలాశయ నీటి మట్టం ఆందోళనకర స్థాయికి చేరుకుంది. జలాశయంలో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 61.96 మీటర్ల డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరింది. దీంతో ఈ ప్రాజెక్టు పరిధిలోని వంగర, సంతకవిటి, రేగిడి పొందూరు, రణస్థలం, జి.సిగడాం, లావేరు మండలాల ఆయుకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో లేకపోవడంతో పాటు ఎండల తీవ్రతకు నీరు ఆవిరైపోతుండడంతో జలాశయంలో నీటిమట్టం వేగంగా పడిపోతుంది. వర్షాలు కురవకపోతే మరో నాలుగు రోజుల్లో జలాశయం పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడనుంది. దీనివల్ల సాగునీరందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. తాగునీటి సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో నీటిని అత్యంత జాగ్రత్తగా వినియోగించుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులు సూచిస్తున్నారు.