Share News

interest cheeting రికవరీలో కిరికిరి!

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:30 AM

interest cheeting రాజాం పీఏసీఎస్‌లో గత పాలకవర్గ హయాంలో భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. దర్యాప్తులో ఆ విషయం వెల్లడైంది. ప్రధానంగా రుణాల రికవరీలో సిబ్బంది చేతివాటం వెలుగుచూసింది. అప్పట్లో అధికార పార్టీ నేతలు బినామీల పేరుతో భారీగా రుణాలు పొందారని.. రికవరీలో సిబ్బంది వారితో చేతులు కలిపి వ్యవహారం నడిపారని తేలింది. అయితే ఎంత మొత్తంలో అవినీతికి పాల్పడ్డారనేది మాత్రం ఇంతవరకూ బయటపడలేదు.

interest cheeting రికవరీలో కిరికిరి!
రాజాం పీఏసీఎస్‌ కార్యాలయం

రికవరీలో కిరికిరి!

పీఏసీఎస్‌ల్లో వెలుగుచూస్తున్న అవినీతి

వైసీపీ హయాంలో దొంగ రశీదులతో పక్కదారి

గుర్తించిన ప్రస్తుత పాలకవర్గాలు

జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న విచారణ

రాజాం, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి):

రాజాం పీఏసీఎస్‌లో గత పాలకవర్గ హయాంలో భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. దర్యాప్తులో ఆ విషయం వెల్లడైంది. ప్రధానంగా రుణాల రికవరీలో సిబ్బంది చేతివాటం వెలుగుచూసింది. అప్పట్లో అధికార పార్టీ నేతలు బినామీల పేరుతో భారీగా రుణాలు పొందారని.. రికవరీలో సిబ్బంది వారితో చేతులు కలిపి వ్యవహారం నడిపారని తేలింది. అయితే ఎంత మొత్తంలో అవినీతికి పాల్పడ్డారనేది మాత్రం ఇంతవరకూ బయటపడలేదు.

రాజాం పీఏసీఎస్‌లోనే కాదు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. గత ఏడాది నుంచి సహకార సొసైటీల్లో మాన్యువల్‌ లావాదేవీలు నిలిపివేశారు. ఆన్‌లైన్‌లోనే ఎంట్రీలు నమోదు చేయాలి. డిపాజిట్ల సేకరణ, రుణాల మంజూరు, బకాయిల వసూలు, ఎరువులు, ధాన్యం కొనుగోలు ప్రక్రియలన్నింటినీ కంప్యూటర్‌ ఆధారంగానే చేయాలి. ఆప్కాబ్‌, డీసీసీబీ తరహాలోనే కోర్‌ బ్యాంకింగ్‌ సొల్యూషన్స్‌ను వినియోగించాలి. ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. కాగా పీఏసీఎస్‌లలో రుణాల రికవరీలో భారీగా అవతవకలు జరిగినట్టు సమాచారం. నచ్చినట్లు రుణాలు ఇవ్వడం ఓ తంతు అయితే వాటిని రికవరీ చేయడంలో అధికారులు మరింత చాకచక్యం ప్రదర్శించారు. రుణాలు పొందిన వారితో కలిసిపోయి వారు చెప్పినట్లు రికవరీ చేశారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై కూటమి ప్రభుత్వంతో పాటు కొత్త పాలకవర్గాలు సీరియస్‌గా ఉన్నాయి. చాలా మంది సభ్యులు ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం విచారణ సాగుతోంది. సభ్యులుగా ఉండే రైతులకు నోటీసులిస్తున్నారు. రుణాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. అయితే తాము అంత రుణం తీసుకోలేదని కొందరు, అసలు తాము సహకార రుణాలనే తీసుకోలేదని మరికొందరు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం అన్ని పీఏసీఎస్‌ల్లో సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశాలిచ్చింది. ఆ ప్రక్రియ కొనసాగుతోంది.

పాలక వర్గాలు మారడంతో..

జిల్లాలో 65 పీఏసీఎస్‌లు ఉన్నాయి. డీసీసీబీ తొలుత కాంగ్రెస్‌, ఆ తరువాత వైసీపీ నేతల చేతుల్లోనే ఉండిపోయింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత డీసీసీబీ చైర్మన్‌గా కిమిడి నాగార్జున బాధ్యతలు చేపట్టారు. ఆయన పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. గతంలో అవినీతి, కమీషన్ల దందా జరిగిందన్న విషయం బయట పెట్టారు. రామభద్రపురం, బాడంగి సొసైటీల్లో అయితే భారీ అక్రమాలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. బాడంగిలో సీఈవో సొంతానికి రూ.42 లక్షలు వాడుకున్నారు అంటే ఏ స్థాయిలో అవతకవకలు జరిగాయో అర్థం అవుతోంది. తెర్లాం సొసైటీలో అవకతవకలు జరిగినట్టు స్వయంగా సభ్యుడు ఫిర్యాదుతో కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. దాదాపు అన్ని సొసైటీల్లో నకిలీ రశీదులతో రైతులకు అన్యాయం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దర్యాప్తు కొనసాగుతోంది.

అక్రమాలపై కఠిన చర్యలు

సహకార సొసైటీల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. తప్పుడు రశీదులు ఇచ్చి ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి. రైతులకు పారదర్శకమైన సేవలంది ంచేందుకే పీఏసీఎస్‌లు ఉన్నాయి. కొత్త పాలకవర్గాలు వచ్చిన తరుణంలో ఇప్పటికే సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాం.

- పి.రమేష్‌, జిల్లా సహకార శాఖ అధికారి, విజయనగరం

Updated Date - Apr 30 , 2026 | 12:30 AM