గోమాత ఆశ్రమంలో తనిఖీ
ABN , Publish Date - Jun 09 , 2026 | 12:04 AM
గుమ్మలక్ష్మీపురంలోని గోమాత ఆశ్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు.
గుమ్మలక్ష్మీపురం, జూన్ 8 (ఆంధ్ర జ్యోతి): గుమ్మలక్ష్మీపురంలోని గోమాత ఆశ్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహిం చారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు చంద్రమౌళి గోమాత ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు వైద్యం చేస్తున్నారని ఇటీవల పలువురు కలెక్టర్ ప్రభాకర్రెడ్డికి ఫిర్యాదు చేశారు. కిడ్నీ వ్యాధిని నయం చేస్తానని చంద్రమౌళి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ రోగులను ఆకర్షిస్తున్నారని, అధికంగా ఫీజులు తీసుకుంటూ ఆయుర్వేద ట్రీట్మెంట్ చేస్తున్నాడని కలెక్టర్కు వివరించారు. అందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్.. వైద్యఆరోగ్యశాఖ అధికారులను విచారణకు ఆదేశించారు. సోమవారం జిల్లా ప్రోగ్రాం అధికారి విజయమోహన్, తాడికొండ పీహెచ్సీ వైద్యుడు బుద్ధేశ్వరరావు, రేగిడి పీహెచ్సీ వైద్యుడు రాజ్మనోహర్, దుడ్డికళ్లు పీహెచ్సీ వైద్యుడు దిలీప్కుమార్, ఆర్ఆర్బీ పురం పీహెచ్సీ వైద్యురాలు సుస్మిత వివరాలను సేకరించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.